Tata Technologies – IPO | రెండు దశాబ్ధాల తర్వాత టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ (Tata Technologies) ఐపీవోకు రావడంతో ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య మద్దతు లభించింది. రూ.3042 కోట్ల విలువైన నిధుల సేకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చిన టాటా టెక్నాలజీ షేర్ల కోసం రూ.1.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరిగిపోయి రూ.1.07 లక్షల కోట్ల విలువైన షేర్లకు బిడ్లు వచ్చాయి.
అన్ లిస్టెడ్ మార్కెట్లో టాటా టెక్నాలజీ షేర్లకు భారీ గిరాకీ నెలకొంది. టాటా టెక్ షేర్ ఐపీవో ధర కంటే 80 శాతానికి పైగా ధర పలికింది. ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇతర ఐపీఓ ఆఫర్ల కంటే టాటా టెక్నాలజీస్ ఐపీవోకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది.
మొత్తం 4.5 కోట్ల షేర్లను ఐపీఓలో బిడ్ల దాఖలుకు టాటా టెక్నాలజీస్ ప్రతిపాదించింది. బుధవారం మొదలైన టాటా టెక్ ఐపీవో బిడ్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం ముగిసింది. గడువు ముగిసే సమయానికి టాటా టెక్ షేర్ల కోసం 312.42 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. అంటే ఇన్వెస్టర్ల నుంచి 69.4 రెట్లు ప్రతిస్పందన ఉందన్నమాట. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద గణిస్తే రూ.1.56 లక్షల కోట్ల విలువైన షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. అయితే, ఐపీఓలో టాటా టెక్ తన షేర్ విలువ రూ.475-500గా నిర్ణయించడం గమనార్హం.
తొలి రోజు (నవంబర్ 22) 6.54 రెట్లు ఇన్వెస్టర్లు స్పందించారు. రెండో రోజు బుధవారం 14.85 రెట్లు బిడ్లు దాఖలు కాగా, చివరి రోజు శుక్రవారం ఇన్వెస్టర్లు భారీగా బిడ్లు ఫైల్ చేయడంతో మొత్తం 69.4 రెట్లు ఎక్కువ బిడ్లు దాఖలయ్యాయి. తొలుత ఐపీఓ ద్వారా 6.08 కోట్ల షేర్లను తీసుకొచ్చిన టాటా టెక్.. మొత్తం తన వాటాలో 11.4 శాతం ఉపసంహరించుకుంటున్నది. ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ 2.4 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్-ఐ 1.2 శాతం వాటాల విక్రయిస్తున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద టాటా టెక్ ఐపీవో కొనసాగుతున్నది.