న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఎగుమతుల వృద్ధి అంతంతగానే ఉండటం, క్రూడ్ ధరల ప్రభావంతో దిగుమతులు భారీగా పెరగడంతో గత కొద్దినెలల్లానే ఆగస్టులో కూడా వాణిజ్యలోటు ఎగిసిపోయింది. కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం నిరుడు ఆగస్టుతో పోలిస్తే 2022 ఆగస్టులో భారత్ వాణిజ్యలోటు రెట్టింపునకు పైగా పెరిగి 27.98 బిలియన్ డాలర్లకు చేరింది. నిరుడు ఇదే నెలలో ఈ లోటు 11.71 బిలియన్ డాలర్లు. గత నెలలో ఎగుమతులు 1.62 శాతం స్వల్ప వృద్ధితో 33.92 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు మాత్రం భారీగా 37.28 బిలియన్ డాలర్ల నుంచి 61.9 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఎగుమతులు 17.68 శాతం వృద్ధితో 193.51 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు ఏకంగా 45.71 శాతం పెరిగి 318 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఈ ఐదు నెలల్లో వాణిజ్యలోటు 53.78 బిలియన్ డాలర్ల నుంచి 124.52 బిలియన్ డాలర్లకు ఎగిసింది.
తగ్గిన పుత్తడి దిగుమతులు
ఆగస్టు నెలలో క్రూడాయిల్ దిగుమతులు భారీగా 87.44 శాతం పెరిగి 17.7 బిలియన్ డాలర్లకు చేరాయి. పుత్తడి దిగుమతులు మాత్రం 47 శాతం క్షీణించి 3.57 బిలియన్ డాలర్లకు తగ్గాయి. కానీ వెండి దిగుమతులు మాత్రం జోరుగా 15.49 మిలియన్ డాలర్ల నుంచి 684.34 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ముగిసిన ఆగస్టు నెలలో ఇతర కమోడిటీలైన బొగ్గు, కోక్ దిగుమతులు 133.64 శాతం వృద్ధితో 4.5 బిలియన్ డాలర్లకు, రసాయినాల దిగుమతులు 43 శాతం పెరుగుదలతో 3 బిలియన్ డాలర్లకు, వంటనూనెల దిగుమతులు 41.55 శాతం వృద్ధితో 2 బిలియన్ డాలర్లకు చేరాయి. 2022 ఆగస్టులో ఎలక్ట్రానిక్స్ వస్తువులు, బియ్యం, తేయాకు, కాఫీ దిగుమతలు సైతం వృద్ధిచెందాయి. ఇక ఎగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులు 22.76 శాతం వృద్ధితో 5.71 బిలియన్ డాలర్లకు, కెమికల్స్, ఫార్మా ఉత్పత్తులు 13.47 శాతం, 6.76 శాతం చొప్పున పెరిగి 2.53 బిలియన్ డాలర్లు, 2.14 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 14 శాతం క్షీణించి 8.3 బిలియన్ డాలర్లకు, జెమ్స్, జ్యువెల్లరీ 3 శాతం తగ్గుదలతో 3.33 బిలియన్ డాలర్లకు, రెడీమేడ్ దుస్తులు 0.34 శాతం క్షీణతతో 1.23 బిలియన్ డాలర్లకు తగ్గాయి.