ముంబై, జనవరి 27: కీలక వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గే వీల్లేదని, ఇప్పుడున్న అధిక వడ్డీరేట్లు ఇంకా చాలాకాలమే కొనసాగవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. శుక్రవారం దుబాయ్లో జరిగిన ఫిక్స్డ్ ఇన్కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఫిమ్డా), ప్రైమరీ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (పీడీఏఐ) వార్షిక సమావేశంలో దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్రవ్యోల్బణం అదుపు లక్ష్యాలతోనే ముందుకెళ్తామన్నారు. ఇందులోభాగంగానే అధిక వడ్డీరేట్లు ఇంకొంత కాలం కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఇక డీ-గ్లోబలైజేషన్, ఆయా దేశాల్లో పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులే ప్రపంచ సరఫరా వ్యవస్థలో ఇటీవలి కుదుపులకు కారణమని దాస్ విశ్లేషించారు. మరోవైపు క్రిప్టోలను నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాదించారు. అయితే క్రిప్టో కరెన్సీలకు కీలకమైన బ్లాక్చైన్ టెక్నాలజీకి మద్దుతునివ్వాల్సి ఉందని కూడా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చాలా వ్యవస్థలు దీనిపైనే ఆధారపడి నడుస్తున్నాయన్నారు.