ముంబై, ఏప్రిల్ 22: ప్రభుత్వరంగ ఆర్థిక సేవల సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) గృహ రుణాలు తీసుకోనున్నవారికి శుభవార్తను అందించింది. ఈ రుణాలపై వడ్డీరేటును 6.75 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఒకవైపు అన్ని బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతుంటే బీవోబీ మాత్రం వడ్డీరేట్లను తగ్గించడం విశేషం. నూతన వడ్డీరేట్లు రుణ గ్రహితలు క్రెడిట్ ప్రొఫైల్ సరిగా ఉన్నవారికి మాత్రమే వర్తించనున్నది. ఈ స్వల్పకాలిక ఆఫర్ జూన్ 30, 2022 వరకు అందుబాటులో ఉండనున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలలో వెల్లడించింది. ఇంటి రుణం తీసుకునేవారికి ప్రత్యేక వడ్డీని ప్రకటించినట్లు, ప్రాసెసింగ్ చార్జీలను సైతం ఎత్తివేసినట్లు బ్యాంక్ జనరల్ మేనేజర్ హెచ్టీ సోలంకి తెలిపారు. ఈ నూతన రేట్లు కొత్తగా రుణాలు తీసుకోనున్నవారికి, బ్యాలెన్స్ను ట్రాన్స్ఫర్ చేసుకున్నవారికి మాత్రమే వర్తించనున్నది. అలాగే సిబిల్ స్కోర్ 771కిపైగా ఉన్నవారు మాత్రమే ఈ వడ్డీరేటుకు అర్హులు. ఈ నెల మొదట్లో వడ్డీరేటును పెంచిన బ్యాంక్..అంతలోనే తగ్గించడం విశేషం.