Intel on Chip | కరోనాతో పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరగడం.. వర్క్ ప్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతి అమల్లోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా మొబైల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చిప్ కొరత నెలకొంది. చిప్లు, సెమీ కండక్టర్ల కొరతతో స్మార్ట్ ఫోన్ల లాంచింగ్, కార్ల ఆవిష్కరణలు.. జాప్యం అవుతున్నాయి. కార్ల డెలివరీ కూడా ఆలస్యం అవుతున్నది. ఈ నేపథ్యంలో చిప్ల కొరతను నివారించడానికి టెక్ దిగ్గజం ఇంటెల్ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నది. అమెరికాలోని ఓహియోలో అతిపెద్ద చిప్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం 100 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నది.
తొలి దశలో 20 బిలియన్ల డాలర్ల పెట్టుబడితో న్యూ అల్బేనీలో 1000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నది. ఇప్పటి వరకు చిప్ల తయారీలో ఆధిపత్యం ప్రదర్శించడానికి ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింజర్ విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు చిప్ల తయారీపై ఆసియా మాన్యుఫాక్చరింగ్లపై అమెరికా ఆధారపడుతూ వచ్చింది. ఆ పరిస్థితిని తిరగరాసేందుకు ఇంటెల్ పూనుకున్నది. ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో 3000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మున్ముందు 8 ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి 100 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నది.