న్యూయార్క్ : ఆర్ధిక మందగమనం సంకేతాలతో ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఇప్పటికే పలు వ్యయనియంత్రణ చర్యలు చేపడుతుండగా తాజాగా ఇంటెల్ అదే బాటలో నడవనుంది.
ఏడాదిలో 20 శాతం సిబ్బందిని తొలగించనున్నట్టు ప్రపంచంలో అతిపెద్ద చిప్ తయారీ సంస్ధ ఇంటెల్ వెల్లడించింది.
మూడో క్వార్టర్ ఆర్ధిక ఫలితాలను ప్రకటిస్తూ ఇంటెల్ లేఆఫ్స్ బాంబు పేల్చింది. 2023 నాటికి 300 కోట్ల డాలర్ల వ్యయాన్ని తగ్గించనున్నట్టు తెలిపింది. ఇందులో అత్యధిక భాగం ఉద్యోగులపై వేటు వేయడం ద్వారా నిర్వహణ వ్యయాలకు ఇంటెల్ కళ్లెం వేయనుంది.
కీలక ఇంజనీరింగ్ టీమ్స్ వెలుపల సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లోనే లేఆఫ్స్ అధికంగా ఉంటాయని ఇంటెల్ సంకేతాలు పంపింది. అదే సమయంలో ఇంటెల్ స్ధిర వ్యయాల్లోనూ 15 శాతం కోత విధించనుంది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందిపై వేటు వేయనున్నట్టు ఇంటెల్ తెలిపింది. ఇక ఫ్యాక్టరీ పని గంటలను తగ్గించడం ద్వారా వ్యయాలను తగ్గించుకునే అవకాశాలనూ ఇంటెల్ పరిశీలిస్తోంది.