Intel | గ్లోబల్ టెక్ దిగ్గజం ‘ఇంటెల్’.. భారత్లోనే లాప్టాప్ల తయారీని ప్రోత్సహించనున్నది. ఇందుకోసం భారత్లోని ఎనిమిది స్థానిక కంపెనీలతో జత కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలకు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్), ఒరిజినల్ డిజైన్ మాన్యుఫాక్చరర్లతో ఎంట్రీ లెవల్ ల్యాప్టాప్ల తయారీకి అవసరమైన టెక్నాలజీని ‘ఇంటెల్’ షేర్ చేసుకుంటుంది. ఆయా ల్యాప్టాప్ల తయారీలో క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్ట్ బెంచ్ మార్క్ కాపాడే విషయంలోనూ అవసరమైన తోడ్పాటును అందిస్తుంది. తద్వారా ‘మేడిన్ ఇండియా’ ప్రాజెక్టుకు ఇంటెల్ మరింత ఊతమివ్వనున్నది.
ఇంటెల్ సంస్థతో జత కట్టిన దేశీయ కంపెనీల్లో భగవతీ ప్రొడక్ట్స్, డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా, కేన్స్ టెక్నాలజీ ఇండియా, ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్, పనాచే డిజిటల్ లైఫ్, స్మైల్ ఎలక్ట్రానిక్స్, సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ, వీవీడీఎన్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. వీటిలో పనాచే డిజిటల్ లైఫ్, కేన్స్ టెక్నాలజీ, సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ తొలిసారి భారత్లో ల్యాప్టాప్ల తయారీలోకి ఎంటరవుతున్నాయి.
ఇంటెల్తోపాటు ఇంతకుముందు ‘గూగుల్’ సైతం తన ‘పిక్సెల్ 8’ ఫోన్లను భారత్లోనే తయారు చేస్తామని ఇటీవల ప్రకటించింది. ఇంటెల్ నిర్ణయంపట్ల కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.