Life Insurance | మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి సమాజ జీవనంలోనే సమూల మార్పులు తెచ్చింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం బీమా పాలసీలకు గిరాకీ పెరిగింది. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు బీమా పాలసీలు తీసుకున్నారని ఎస్బీఐ నిర్వహించిన ఎకోరాప్ నివేదిక తెలిపింది. 2019-20తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా పాలసీలు 32.33 శాతం నుంచి 33 శాతానికి చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం పాలసీల్లో 93 లక్షల పాలసీలు మహిళలు తీసుకున్నారు. భారత్లో ప్రతి ముగ్గురిలో ఒక మహిళ బీమా పాలసీ తీసుకున్నారు. మహిళలు తీసుకున్న బీమా పాలసీల్లో ప్రైవేట్ సంస్థలు విక్రయించినవి 27 శాతం అయితే, భారతీయ జీవిత బీమా సంస్థలో 35 శాతం ఉన్నాయి.
లైఫ్ ఇన్సూరెన్స్, నాన్లైఫ్ ఇన్సూరెన్స్ రంగాలు భవిష్యత్లో మరింత ముందుకు దూసుకెళ్లనున్నాయి. 2001లో 2.71 శాతంగా ఉన్న బీమా కవరేజీ 2009 నాటికి 5.20 శాతానికి దూసుకెళ్లింది. కానీ 2014 ఆర్థిక సంవత్సరంలో 3.30 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ మద్దతు గల, విశ్వజనీన బీమా పాలసీలైన ప్రధాన్మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్మంత్రి సురక్షా బీమా యోజన వంటీ పాలసీలతో 2015 ఆర్థిక సంవత్సరం నుంచి బీమా రంగం పుంజుకోవడం మొదలైంది.
కోవిడ్-19 మహమ్మారి వేళ బీమా రంగంలో శరవేగంగా రికవరీ నమోదైనా.. లాక్డౌన్ వల్ల కొంత ప్రతికూల ప్రభావం పడింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య లైఫ్ ఇన్సూరర్ల న్యూ బిజినెస్ ప్రీమియం (ఎన్బీపీ) 8.4 శాతం పెరిగి రూ.2.54 లక్షల కోట్లకు చేరింది.