రంగారెడ్డి : ఛత్తీస్గఢ్ బీజాపూర్ నక్సలైట్లతో జరిగిన పోరులో వీరమరణం పొందిన జవాన్ మురళీకృష్ణ పార్థీవ సోమవారం రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్, డిప్యూటీ కలెక్టర్ ప్రతీక్ జైన్, సీఆర్పీఎఫ్ డీఐజీ బ్రజేష్సింగ్, సీఆర్పీఎఫ్ కమాడెంట్లు మీనా, ధరమ్ ప్రకాశ్, ఎస్ వికారాం సింగ్, అసిస్టెంట్ కమాండెంట్, సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మణిక్రాజ్, శంషాబాద్ ఏసీపీ భాస్కర్ విమానాశ్రయానికి చేరుకొని మురళీకృష్ణ పార్థీవ దేహానికి నివాళులర్పించి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సీపీ బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. పార్థీవ దేహాన్ని బంధువులకు అప్పగించి.. స్వస్థలం గుంటూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలు మంగళవారం స్వస్థలం గుంటూరు జిల్లాలో జరుగనున్నాయి.