Infosys | ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ (Infosys) ఆదాయం పెంచుకున్నా, నికర లాభాల్లో వెనక బడింది. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం 7.3 శాతం తగ్గింది. 2022-23 మూడో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం రూ.6,586 కోట్లు కాగా, ఈ ఏడాది (2023-24) రూ.6,106 కోట్లకు పరిమితమైంది. మార్కెట్ విశ్లేషకులు రూ.6,140 కోట్ల లాభం గడిస్తుందని అంచనా వేసినా.. కొద్ది తేడాతో అంచనాలు మిస్ అయింది. ఇక నిర్వహణ లాభం సైతం 20.5 శాతానికి పరిమితమై 100 బేసిక్ పాయింట్లు త్గుముఖం పట్టింది.
ఈ పరిస్థితుల్లో ఇన్ఫీ ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెవెన్యూ గైడెన్స్ రెండు నుంచి 1.5 శాతానికి, ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 22 నుంచి 20 శాతానికి కుదించివేసింది. కంపెనీ నుంచి అట్రిక్షన్లు సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 14.6 నుంచి 12.9 శాతానికి తగ్గిపోయాయి. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో 24.3 శాతం అట్రిక్షన్లు చోటు చేసుకున్నాయి. కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 3,22,663 మందికి పడిపోయింది.
మరోవైపు ఇన్ఫీ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం రెవెన్యూ ఒక శాతం పెరిగి రూ.39,821 కోట్లకు చేరుకున్నది. 2022-23 మూడో త్రైమాసికంలో రూ.38,318 కోట్ల ఆదాయం సంపాదించింది. ఇదే కాలంలో ఐటీ మేజర్ 320 కోట్ల డాలర్ల విలువైన పెద్ద డీల్స్ గెలుచుకున్నది. వాటిల్లో 71 శాతం కొత్త డీల్స్ కావడం గమనార్హం. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో గురువారం ఎన్ఎస్ఈలో ఇన్ఫీ స్టాక్ ఫ్లాట్గా రూ.1,520 వద్ద ముగిసింది.