న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నదనడానికి సంకేతంగా పారిశ్రామికోత్పత్తి భారీగా తగ్గింది. ఈ ఏడాది మే నెలలో 5.3 శాతం వృద్ధిచెందిన పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ) జూన్ నెలలో వృద్ధి రేటు 3.7 శాతానికి పడిపోయినట్టు నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది మూడు నెలల కనిష్ఠం. ఈ సంవత్సరం మార్చిలో నమోదైన 1.9 శాతం తర్వాత ఇదే అధమస్థాయి.
2021 ప్రధమార్థం కొవిడ్ లాక్డౌన్ల ఫలితంగా ఏర్పడిన లోయర్ బేస్ మీద 2022 జూన్లో 12.6 శాతం వృద్ధిని కనపర్చినప్పటికీ, ఈ ఏడాది బాగా వెనక్కు తగ్గడం గమనార్హం. ముఖ్యంగా ఐఐపీలో అధిక వెయిటేజి కలిగిన తయారీ రంగం మొత్తం పారిశ్రామిక రంగాన్ని బాగా దెబ్బతీసింది. ఈ రంగం వృద్ధి 3.1 శాతానికి తగ్గిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 12.9 శాతం నుంచి 4.5 శాతానికి క్షీణించింది.