IIP | న్యూఢిల్లీ, మే 12: దేశంలో పారిశ్రామికోత్పత్తి మళ్లీ పడిపోయింది. 5 నెలల కనిష్ఠాన్ని తాకుతూ ఈ ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిరేటు 1.1 శాతానికే పరిమితమైంది. ఇక అంతకుముందు నెలతో పోల్చితే ఏకంగా 4.7 శాతం దిగజారడం గమనార్హం. ఫిబ్రవరిలో ఇది 5.8 శాతంగా ఉన్నది. ఆపై నెల జనవరిలోనూ 5.2 శాతంగా నమోదైంది. చివరకు నిరుడు మార్చితో చూసినా నిరాశాజనకంగానే ఈసారి ఐఐపీ గణాంకాలుండటం ఒకింత కలవరపాటునే కలిగిస్తున్నది. నాడు ఐఐపీ 2.2 శాతంగా ఉంది మరి. దీంతో పోల్చితే ఇప్పుడు సగానికి క్షీణించినట్టు స్పష్టమవుతున్నది. తయారీ, విద్యుదుత్పత్తి వంటి కీలక రంగాల్లో నిస్తేజమే ఇందుకు కారణమని శుక్రవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలనుబట్టే తెలుస్తున్నది. ఈ క్రమంలోనే గనులు, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో వృద్ధి కనిపించినా.. మొత్తం ఐఐపీ లేవలేకపోయింది.
గత ఏడాది అక్టోబర్ తర్వాత దేశ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఇంతలా తగ్గిపోవడం ఇదే తొలిసారి. 2022 అక్టోబర్లో ఐఐపీ మైనస్ 4.1 శాతానికి పతనమైంది. కాగా, జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన ఐఐపీ డాటా ప్రకారం ఈ మార్చిలో తయారీ రంగ కార్యకలాపాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే నిస్తేజం ఆవరించింది. నిరుడు మార్చిలో ఉత్పాదకత వృద్ధిరేటు 1.4 శాతంగా ఉన్నది. ఈసారి కేవలం 0.5 శాతమే. ఐఐపీలోనైనా, దేశ జీడీపీలోనైనా తయారీ రంగ ఉత్పాదకత వాటే కీలకం. ఈ క్రమంలో అంతటి ప్రధాన రంగ కార్యకలాపాలు నత్తనడకన సాగుతుండటం.. దేశంలో మొదలైన ఆర్థిక మందగమన పరిస్థితులకు అద్దం పడుతున్నదన్న అభిప్రాయాలున్నాయి.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐఐపీ వృద్ధిరేటు సగానికిపైగా పడిపోయింది. 2021-22లో దేశ పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు 11.4 శాతంగా ఉంటే.. 2022-23లో 5.1 శాతంగానే నమోదైంది. రుణాలపై పెరుగుతూపోతున్న వడ్డీరేట్లు, అంతకంతకూ తగ్గిపోతున్న వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం, భారంగా మారిన ఉత్పాదక వ్యయం వంటి ఎన్నో ప్రతికూలతలు ఇప్పుడు పరిశ్రమల్ని వేధిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనమని వారు గుర్తుచేస్తున్నారు.
రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 4.7 శాతంగా నమోదైంది. ఇది 18 నెలల కనిష్ఠం. ఆహారోత్పత్తుల ధరలు దిగొచ్చాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో 5.66 శాతంగా ఉన్నది తెలిసిందే. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. తమ ద్రవ్య విధానం సరైన దారిలోనే నడుస్తున్నదనడానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5.2 శాతంగా ఆర్బీఐ అంచనా వేసినది విదితమే. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5.1 శాతం, జూలై-డిసెంబర్లో 5.4 శాతం, జనవరి-మార్చిలో 5.2 శాతంగా ఉండొచ్చన్నది.