న్యూఢిల్లీ, జనవరి 9: ఇండిగో విమానాల్లో ముందు వరుస సీట్లు కావాలంటే ప్రయాణికులు రూ.2,000 వరకు అదనంగా చెల్లించుకోవాల్సిందే. ఈ మేరకు సంస్థకు చెందిన వెబ్సైట్లో ఆయా సేవలకుగాను పేర్కొన్న ఫీజులు, చార్జీలనుబట్టి తెలుస్తున్నది. 232, 222 సీట్లుండే ఏ321 విమానాల్లోనైనా.. 186, 180 సీట్లుండే ఏ320 విమానాల్లోనైనా మొదటి వరుసలో విండో లేదా ఆస్లే సీటు కావాలంటే రూ.2,000 చెల్లించాలి.
ఇప్పటిదాకా ఇది రూ.1,500 వరకు ఉన్నట్టు విమానయాన రంగ విశ్లేషకుడు అమేయ జోషి చెప్తున్నారు. ఇదిలావుంటే మధ్య సీటు కోసం రూ.1,500 ఇవ్వాల్సి ఉంటుందని సంస్థ పేర్కొంటున్నది. కాగా, ఏటీఆర్ విమానాల్లో ఈ చార్జీలు రూ.500 వరకు ఉన్నాయి. అయితే దీనిపై ప్రయాణికుల నుంచి, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నా.. సంస్థ నుంచి మా త్రం ఎటువంటి స్పందనా లేదు. విమాన ఇంధన ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గత వారం దూరాన్నిబట్టి ఆయా రూట్ల టిక్కెట్లపై రూ.1,000 వరకు సంస్థ తగ్గించిన విషయం తెలిసిందే.