Cars Exports | వాణిజ్య యుద్ధంతో ఆర్థిక మందగమనం.. అటుపై కరోనా మహమ్మారి.. తాజాగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం.. క్రూడాయిల్ మొదలు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు.. అల్లాడిపోతున్న సామాన్యులు.. ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా గతంతో పోలిస్తే కార్ల విక్రయాలు పెరిగిపోయాయి. పలు ఆటోమొబైల్ సంస్థలకు కస్టమర్లు 6.53 లక్షల కార్ల కోసం పెట్టిన ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో భారత్ నుంచి విదేశాలకు కార్ల ఎగుమతులు 26 శాతం పెరిగాయి.
2021-22లో 1,27,083 కార్లు ఎగుమతి చేస్తే, ఈ ఏడాది 1,60,263 కార్లను ఆయా కార్ల తయారీ సంస్థలు ఎగుమతి చేశాయి. గతేడాది కరోనా రెండో వేవ్ ఉధృతి వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ లావాదేవీల్లో అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే గతేడాదితో పోలిస్తే వ్యాన్ల ఎగుమతులు 588 నుంచి 316 యూనిట్లకు పడిపోయాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. ఎగుమతిలోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో దక్షిణ కొరియాకు చెందిన సంస్థలు హ్యుండాయ్, కియా మోటార్స్ నిలిచాయి.
మారుతి సుజుకి 68,987 (53 శాతం ఎక్కువ) యూనిట్లు ఎగుమతి చేసింది. గతేడాది 45,056 కార్లు మాత్రమే మారుతి సుజుకి నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. లాటిన్ అమెరికా, ఏషియాన్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇరుగు పొరుగు ప్రాంతాలకు మారుతి సుజుకికి చెందిన బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో, బ్రెజా కార్లు ఎక్కువగా ఎగుమతి అయ్యాయి. కియా మోటార్స్ కార్ల ఎగుమతులు 12,448 నుంచి 21,459 యూనిట్లకు పెరిగాయి. నిస్సాన్ మోటార్ ఇండియా 11,419, ఫోక్స్ వ్యాగన్ 7,146, రెనాల్ట్ 6,658, హోండా 6533 యూనిట్ల కార్లు ఎగుమతి చేశాయి.