GST Collection | మార్చి జీఎస్టీ వసూళ్లు 18 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం 2022-23 చివరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,60,122 కోట్లు నమోదు చేశాయి. 2017 జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక నెలలో జీఎస్టీ వసూళ్లు గరిష్ట స్థాయికి చేరడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2022 ఏప్రిల్లో ఆల్టైం రికార్డు జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్లో రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కావడం ఆల్టైం రికార్డుగా నిలిచింది. గత నెల జీఎస్టీ వసూళ్లు రెండో అత్యధిక స్థాయి
మార్చిలో స్థూల జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ రూ.29,546 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.37,314 కోట్లు, రికార్డు ఐజీఎస్టీ వసూళ్లు రూ.82,907 కోట్లు నమోదయ్యాయి. ఐజీఎస్టీలో వస్తువులపై దిగుమతి సుంకం రూ.42,503 కోట్లు కలిసి ఉన్నాయి. దిగుమతి వస్తువులపై రూ.960 కోట్లతోపాటు సెస్ రూ.10,355 కోట్లు వసూలయ్యాయని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరంలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్ల మార్క్ను దాటడం ఇది నాలుగోసారి. మొత్తం 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.18.10 లక్షలుగా నిలిచింది. అంటే సరాసరి నెలకు రూ.1.51 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందన్నమాట. 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 22 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది.
మార్చిలో రిటర్న్స్ పైలింగ్లు కూడా రికార్డు స్థాయిలో గరిష్టానికి దూసుకెళ్లాయి. 93.2 శాతం ఇన్వాయిస్ స్టేట్మెంట్లు (జీఎస్టీఆర్-1), ఫిబ్రవరిలో జీఎస్టీఆర్-3బీలో 91.4 శాతం ఇన్వాయిస్లు ఫైల్ అయ్యాయని ఆర్థికశాఖ పేర్కొంది.