న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్ధ ఈ ఏడాది మూడవసారి కార్ల ధరలను పెంచింది. ఎంపిక చేసిన మోడల్స్ ధరలను రెండు శాతం పెంచినట్టు మారుతి సుజుకి సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజ్లకు తెలిపింది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం ఎగబాకినందున ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ పేర్కొంది. సెలెరియో మినహా అన్ని మోడళ్ల వాహనాలపై సగటున 1.9 శాతం చొప్పున ధరల పెంపును చేపట్టింది.
ధరల పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని మారుతి సుజుకి వెల్లడించింది. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్లో ధరలు పెంచిన మారుతి సుజుకి తాజాగా మూడవ సారి కార్ల ధరలను పెంచింది. ఈ ఏడాది ఇప్పటికే మారుతి కార్ల ధరలు 3.5 శాతం మేర భారమయ్యాయి. మారుతి రూ 2.99 లక్షల విలువైన ఎంట్రీలెవెల్ అల్టో నుంచి లగ్జరీ సెగ్మెంట్లో రూ 12.39 లక్షలు పలికే ఎస్ క్రాస్ వరకూ పలు శ్రేణుల కార్లను విక్రయిస్తోంది. కమాడిటీ ధరలు పెరగడంతో ముడిపదార్ధాల వ్యయం భారమైందని దీంతో వినియోగదారులపై భారం మళ్లించకతప్పలేదని ధరల పెంపును మారుతి సమర్ధించుకుంది.
స్టీల్ ధరలు గత ఏడాది కిలోకు రూ 28 నుంచి ఈ ఏడాది మే-జూన్లో రూ 65 మేర పెరిగాయని, రాగి ధరలు టన్ను 5200 డాలర్ల నుంచి 10,000 డాలర్లకు రెట్టింపయ్యాయని దీంతో ముడిపదార్ధాల వ్యయం పెరిగినందున కార్ల ధరలు పెంపు తప్పలేదని మారుతి సుజుకి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.