న్యూఢిల్లీ: ఉధ్రుతంగా కరోనా రెండో వేవ్ కేసులు.. దాని నియంత్రణకు పలు రాష్ట్రాలు విధించిన లాక్డౌన్లు.. ఇతర ఆంక్షలు ఇంధన వినియోగంపై భారీగానే ప్రభావం చూపాయి. వ్యక్తుల ప్రయాణాలు నిలిచిపోయాయి. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి.
గత నెలలో పెట్రోల్, డీజిల్ వినియోగం 1.5 శాతం తగ్గి 15.1 మిలియన్ల టన్నులకు పడిపోయింది. గతేడాది 11.3 శాతం ఇంధన వినియోగం తగ్గిందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) వెల్లడించింది. ఇది తొమ్మిది నెలల కనిష్టానికి సమానం.
కరోనాను తొలి దశలో నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా కఠినంగా లాక్డౌన్ విధించిన దేశాల్లో భారత్ ఒకటి. ఫలితంగా అన్ని రకాల ప్రయాణాలు నిలిచిపోయాయి. ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి.
ఈ ఏడాది కోవిడ్-19 కేసుల రేటు తీవ్రంగా ఉన్నా.. దాన్ని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలే స్థానికంగా లాక్డౌన్లు, ఇతర ఆంక్షలు విధించాయి. అందువల్ల గతేడాది మాదిరిగా పర్సనల్ మొబిలిటీ పెద్దగా నిలిచిపోలేదు. పలు కంపెనీలు యధావిధిగా పని చేశాయి. రాష్ట్రాల మధ్య సరుకు రవాణాపై అంతగా ప్రభావం పడలేదు.
గతేడాదితో పోలిస్తే గత నెలలో 1.99 మిలియన్ల టన్నుల పెట్రోల్ వాడకం జరిగింది. గతేడాదితో పోలిస్తే 12 శాతం ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్తో పోలిస్తే 16 శాతం, ప్రీ-కోవిడ్ హయాంతో పోలిస్తే 27 శాతం తక్కువ.
డీజిల్ విక్రయాలు స్వల్పంగా 5.53 మిలియన్ల టన్నులకు పెరిగాయి. కానీ ఏప్రిల్తో పోలిస్తే 17 శాతం, ప్రీ-కోవిడ్ తరంతో పోలిస్తే 29 శాతం తక్కువ.
విమాన సర్వీసులను నిలిపేయడంతో ఏటీఎఫ్ సేల్స్ 36 శాతం తగ్గి, 2.63 టన్నులకు పడిపోయాయి. కానీ గతేడాది జరిగిన ఏటీఎఫ్ సేల్స్ 1.10 టన్నులతో పోలిస్తే రెట్టింపుకు పై చిలుకే. ప్రీ-కోవిడ్ హయాంలో 6.80 టన్నుల ఏటీఎఫ్ డిమాండ్ ఉంది.
ఇక వంట గ్యాస్ వినియోగం మాత్రం పెరిగింది. గత నెలతో పోలిస్తే 2.16 మిలియన్ టన్నుల వంట గ్యాస్ వినియోగం జరిగింది. గతేడాది దేశవ్యాప్త లాక్డౌన్ విధించినప్పుడు పెరిగింది. గతేడాదితో పోలిస్తే గత నెలలో వంట గ్యాస్ వినియోగం 5.5 శాతం తక్కువ. 2019 మేతో పోలిస్తే 5.5 శాతం ఎక్కువ.
గత ఏప్రిల్ నెలలో సగటున రోజూ 4.5 మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. దీంతో ఐదు నెలల కనిష్టం నుంచి దేశీయ ముడి చమురు దిగుమతి కోలుకున్నది. మే, జూన్ నెలల్లో ముడి చమురు దిగుమతికి డిమాండ్ పెరుగవచ్చునన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.