ముంబై, ఆగస్టు 4: భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు వరుసగా రెండోవారంలోనూ తగ్గాయి. జూలై 28తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 3.165 బిలియన్ డాలర్ల మేర క్షీణించి రూ. 603.87 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. అంతక్రితం వారం ఇవి 1.987 బిలియన్ డాలర్లు తగ్గి 607.035 బిలియన్ డాలర్లకు చేరాయి. రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు డాలర్లను విక్రయించడంతో నిల్వలు తగ్గాయని ఫారెక్స్ నిపుణులు చెప్పారు.
కేంద్ర బ్యాంక్ డాలర్లను విక్రయించిన కారణంగా విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 2.416 బిలియన్ డాలర్ల మేర క్షీణించి 535.337 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. డాలర్ విలువలో కలిగిన మార్పులతో పాటు ఆర్బీఐ వద్దనున్న యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీలకు డాలరు మారకంలో ఏర్పడిన తరుగుదల లేదా పెరుగుదలను సైతం ఈ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు.
జూలై 28తో ముగిసిన వారంలో బంగారం నిల్వలు 710 మిలియన్ డాలర్లు క్షీణించి 44.904బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్లు) 29 మిలియన్ డాలర్ల మేర తగ్గి 18.444 బిలియన్ డాలర్ల స్థాయికి పెరిగాయి. ఐఎంఎఫ్ వద్దనున్న నిల్వలు 11 మిలియన్ డాలర్ల వరకూ తగ్గి 5.185 బిలియన్ డాలర్లకు చేరాయి. 2021 అక్టోబర్లో నమోదైన 645 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయిని మళ్లీ విదేశీ మారక నిల్వలు అందుకోలేకపోతున్నాయి. అప్పటి నుంచి నిలువునా పడిపోయిన రూపాయి పతనాన్ని నిరోధించడానికి రిజర్వ్బ్యాంక్ డాలర్లను విక్రయిస్తూ వచ్చింది. దీంతో ఒకదశలో రిజర్వులు 500 బిలియన్ డాలర్లస్థాయికి సైతం పడిపోయాయి.