Fiscal Deficit | న్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు భారీగా పెరిగింది. జూలై ముగిసేనాటికి ఇది రూ.6.06 లక్షల కోట్లకు చేరినట్టు గురువారం అధికారిక గణాంకాల్లో వెల్లడయ్యింది. వార్షిక బడ్జెట్ ద్రవ్యలోటు అంచనాల్లో ఇది 33.9 శాతానికి చేరిపోయింది. నిరుడు ఇదేకాలానికి వార్షిక అంచనాల్లో 20.5 శాతం మాత్రమే ద్రవ్యలోటు నమోదయ్యింది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ద్రవ్యలోటును అదుపు చేయడానికి పలు ఆర్థిక చర్యలు ప్రకటిస్తుందన్న నేపథ్యంలో ద్రవ్యలోటు మరింత పెరుగుతుందన్న అంచనాలు విశ్లేషకుల నుంచి వెలువడుతున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్-జూలై మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ వ్యయం రూ.13.81 లక్షల కోట్లకు చేరింది. మొత్తం ఆదాయ వసూళ్లు రూ.7.75 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లక్ష్యంలో ఇవి 28.5 శాతం, 30.7 శాతంగా ఉన్నాయి. ఆదాయ వసూళ్లు రూ.7.61 లక్షల కోట్లు కాగా, ఇందులో పన్ను ఆదాయం 5.83 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం రూ.1.79 లక్షల కోట్లు ఉంది. బడ్జెట్ అంచనాల్లో ఇవి 25 శాతం, 59.3 శాతంగా నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరంతో ఇదే సమయానికి వసూలైన పన్ను ఆదాయంతో పోలిస్తే 34.4 శాతం నుంచి తగ్గింది. పన్నుయేతర ఆదాయం మాత్రం 33.2 శాతం నుంచి పెరిగింది. రెవిన్యూ లోటు రూ.3.02 కోట్లుకాగా, ఇది బడ్జెట్ లక్ష్యంలో 34.7 శాతం. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.9 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యంగా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్దేశించారు. నిరుడు ఇది 6.4 శాతం. కానీ ద్రవ్యలోటు విషయంలో కేంద్రం లక్ష్యం గాడి తప్పుతుందన్న అంచనాలు ఆర్థిక విశ్లేషకుల్లో ఉన్నాయి.