Fiscal Deficit | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి ఐదు నెలల్లోనే (ఏప్రిల్-ఆగస్ట్) ద్రవ్యలోటు రూ.6.43 లక్షల కోట్లకు చేరుకున్నది. బడ్జెట్ అంచనాల్లో ఇది 36 శాతం. ఏడాదికేడాది ద్రవ్యలోటు పెరిగిపోతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 32.6 శాతం పెరిగింది.
ఆగస్టు నెలాఖరు నాటికి మొత్తం రూ.10.29 లక్షల కోట్ల వసూళ్లు జరిగితే, రూ.16.72 లక్షల కోట్ల నిధులు ఖర్చు చేసింది కేంద్రం. రెవెన్యూ వసూళ్లు రూ.10.14 లక్షల కోట్లు ఉండగా, వాటిల్లో టాక్స్ రెవెన్యూ 8.03 లక్షల కోట్లు కాగా, పన్నేతర రెవెన్యూ రూ.2.10 లక్షల కోట్లుగా నిలిచింది. గతేడాదితో పోలిస్తే పన్ను రెవెన్యూ ఏడు లక్షల కోట్లు పెరిగింది. కార్పొరేట్ టాక్స్ వసూళ్లు 2022-23తో పోలిస్తే 15 శాతానికి పైగా పెరిగి రూ.2.39 లక్షల కోట్లకు చేరాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 34.5 శాతం పన్ను, 69.5 శాతం పన్నేతర ఆదాయం లభిస్తుందని బడ్జెట్ ప్రతిపాదనల్లో అంచనా వేశారు. కానీ.. పన్ను వసూళ్ళు.. బడ్జెట్ అంచనాల కంటే 36.5 శాతం పెరిగితే, పన్నేతర ఆదాయం వసూళ్లు బడ్జెట్ అంచనాల నుంచి 43.3 శాతానికి పడిపోయాయి. ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం కింద రూ.87,416 కోట్లు బదిలీ చేయడంతో పన్నేతర ఆదాయం పెరిగింది. బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ.28.44 లక్షల కోట్లు (32.6 శాతం) ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ద్రవ్యలోటు 5.9 శాతానికి కుదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు.