ముంబై, డిసెంబర్ 29: కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ఈ ఏడాది నవంబర్ చివరినాటికి రూ.9.07 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించుకున్న అంచనాల్లో ఇది 50.9 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య నెలల్లో ప్రభుత్వ వసూళ్లు రూ.17.46 లక్షల కోట్లుకాగా, మొత్తం వ్యయం రూ.26.52 లక్షల కోట్లకు చేరుకుందని శుక్రవారం విడుదలైన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య ఏర్పడే వ్యత్యాసాన్నే ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. బడ్జెట్ అంచనాల్లో నవంబర్కల్లా 64.3 శాతం వసూళ్లు జరిగాయి. వ్యయం 58.9 శాతంగా నమోదయ్యింది. నిరుడుతో పోలిస్తే వసూళ్లు 64.1 శాతం నుంచి పెరగ్గా, వ్యయాలు 61.9 శాతం నుంచి తగ్గాయి. రెవిన్యూ వసూళ్లలో 14.36 లక్షల కోట్లు పన్నుల ద్వారా సమకూరింది. మిగిలింది పన్నుయేతర ఆదాయంగా లభించింది. ఇది నిరుడుతో పోలిస్తే భారీగా పెరిగింది. రిజర్వ్బ్యాంక్ కేంద్రానికి రూ.87,416 కోట్లు బదిలీ చేయడంతోనే పన్నుయేతర ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచుకున్నది. ఇక వ్యయాల్లో కేంద్రం ప్రధానంగా రూ.2.43 లక్షల కోట్లు ఆహార, ఎరువులు, పెట్రోలియం సబ్సిడీల కోసం ఖర్చుచేసింది. అయితే ఇప్పటివరకూ సబ్సిడీలకు అయిన వ్యయం పూర్తి సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపుతో పోలిస్తే 65 శాతమే.