Mobiles Usage | ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్.. స్మార్ట్ ఫోనే.. వార్తల నుంచి ఎంటర్టైన్మెంట్.. కెరీర్ అంశాలను చెక్ చేసుకోవడానికి ఆధారం స్మార్ట్ ఫోన్. 2021లో భారతీయుల్లో ప్రతి రోజూ సగటున 4.42 గంటలు స్మార్ట్ ఫోన్తోనే గడుపుతున్నారని తేలింది. వినోద సాధనం టీవీ చానెల్స్ 3.17 గంటలు మాత్రమే వీక్షించారని అమెరికా కేంద్రంగా రూపొందించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ అత్యధికంగా వాడుతున్న వారిలో బ్రెజిలియన్లు మొదటి స్థానంలో ఉన్నారు. వారు ప్రతి రోజూ 5.24 గంటల పాటు స్మార్ట్ ఫోన్లతోనే కాలక్షేపం చేశారు.
గతేడాది భారతీయుల వద్ద మొబైల్ ఫోన్లలో 96 శాతం ఆండ్రాయిడ్ ఫోన్లు. బ్రెజిల్ వాసుల్లో 86 శాతం మంది వద్ద ఈ ఫోన్లు ఉన్నాయి. యూఎస్ కేంద్రంగా పని చేస్తున్న యాప్ సంస్థ అన్నీ అలియాస్ డేటా.ఏఐ ఆధ్వర్యంలో కృత్రిమ మేథ ఆధారంగా ప్రపంచ దేశాల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై అధ్యయనం జరిపింది.
2020తో పోలిస్తే చైనా, అర్జెంటీనాల్లో మొబైల్ ఫోన్ల వాడకం తగ్గింది. చైనీయులు 2020లో 3.5 గంటల పాటు స్మార్ట్ ఫోన్లతో గడిపితే, గతేడాది 3.2 గంటలకు పడిపోయింది. అర్జెంటీనాలో 3.8 గంటల నుంచి 3.6 గంటలకు పడిపోయింది.
భారత్లో కరోనా వేళ స్మార్ట్ ఫోన్లు 120 కోట్లు పెరిగాయి. 2021 అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికంలో ప్రతి 10 నిమిషాలకు 4.6 నిమిషాలు సోషల్ మీడియా, కమ్యూనికేషన్ యాప్స్లపైనే కాలం వెళ్లదీశారు. మరో 3.5 నిమిషాలు ఫొటో, వీడియో, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాప్స్, ఫొటో అండ్ వీడియో యాప్స్పై 2.5 నిమిషాలు గడిపారు.
భారత్లో 2021లో డేటా డౌన్లోడ్ 10 శాతం పెరిగింది. డేటా డౌన్లోడ్లో చైనా తర్వాత స్థానం భారత్దే. పాకిస్థాన్ (25శాతం) , పెరూ (25శాతం), ఫిలిప్పీన్స్ (25శాతం), వియత్నాం (20శాతం)లలో డౌన్లోడ్స్ పెరిగాయి. 2020లో అన్ని క్యాటగిరీల ఫైనాన్స్ యాప్స్ డౌన్లోడ్స్ శరవేగంగా 27 శాతం పెరిగితే, వాటి వాడకం 46 శాతం వృద్ధి చెందింది. ఇక మెడికల్ యాప్స్ డౌన్లోడ్స్ 36 శాతం వృద్ధి చెందితే, వాటి వినియోగం 38 శాతం పెరిగింది.
భారత్లో మొబైల్స్ మీద వినియోగదారులు గతేడాది 417 మిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు. 2020లో 503 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయడం గమనార్హం. చైనాలో 56 బిలియన్ డాలర్లు, అమెరికాలో 43 బిలియన్ల డాలర్లు, జపాన్లో 21 బిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు.