ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు బ్లాక్మండే. ఇవాళ మార్కెట్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెక్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ రెండూ ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగాయి. మొదట్లో భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇంట్రా డేలో మరింత దిగజారాయి. ట్రేడింగ్ ముగింపు సమయానికి కొంతమేరకు తేరుకుని నష్టాల భారాన్ని తగ్గించాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1200 పాయింట్లు (2.09 శాతం) నష్టపోయి 55,822 వద్ద ముగిసింది. టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టాప్ లూసర్లుగా ఉన్నాయి. నిఫ్టీ సైతం 371 పాయింట్లు కోల్పోయి 16,614 వద్ద ముగిసింది. ఇందులో బీపీసీఎల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూసర్స్గా మిగిలాయి.
ప్రపంచ పరిణామాలు, ఒమిక్రాన్ భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లకు ఊరటనిచ్చే అంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు ఒడిదుడుకులు ట్రేడింగ్ను ప్రేరేపించాయంటున్నారు. తాజా నష్టాలతో మదుపర్ల సంపద ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు ఆవిరయ్యిందని నిపుణులు అంచనా వేశారు.