ముంబై, సెప్టెంబర్ 20: గత రెండు వారాల్లో వరుస ర్యాలీలతో అదరగొట్టిన భారత్ స్టాక్ సూచీలు బుధవారం ఫెడ్ ఫీవర్తో వణికిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక్కసారిగా 869 పాయింట్లు పతనమైన ఇంట్రాడేలో 66,728 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 796 పాయింట్ల నష్టంతో 66,801 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 274 పాయింట్లు క్షీణించి 19,878 కనిష్ఠాన్ని టచ్ చేసింది. తుదకు 232 పాయింట్ల తగ్గుదలతో 19,901 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో యూఎస్ బాండ్ ఈల్డ్స్ సంవత్సరాల గరిష్ఠస్థాయికి చేరడం, క్రూడ్ ధరలు నెలల గరిష్ఠస్థాయిలో ట్రేడ్కావడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారీ విక్రయాలు జరిపారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. భారత్-కెనడాల మధ్య తాజాగా నెలకొన్న వివాదం కూడా మార్కెట్లపై ప్రభావం చూపించినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు. యూఎస్ ఫెడ్తో పాటు ఈ వారంలో స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే, బ్రిటన్, జపాన్ కేంద్ర బ్యాంక్ల వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్నాయి.
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4 శాతం పడిపోయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, టాటా స్టీల్, విప్రో, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, లార్సన్ అండ్ టుబ్రోలు 1-3 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు పవర్గ్రిడ్, సన్ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టీసీఎస్లు లాభపడ్డాయి.
ఇటీవల జోరుగా పెరిగిన బ్యాంకింగ్ షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే బీఎస్ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ అత్యధికంగా 1.39 శాతం, కమోడిటీస్ 1.39 శాతం చొప్పున తగ్గాయి. మెటల్ సూచి 1.25 శాతం, రియల్టీ ఇండెక్స్ 1.20 శాతం, బ్యాంకెక్స్ 1.05 శాతం, టెలికమ్యూనికేషన్స్ 0.95 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.68 శాతం మేర క్షీణించాయి. యుటిలిటీస్, పవర్ ఇండెక్స్లు గ్రీన్లో ముగిసాయి.
బుధవారంనాడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారీగా రూ.3,110 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. సోమవారం సైతం రూ.1,236 కోట్లు వెనక్కు తీసుకున్నారు. ఈ వారం తొలి రెండు రోజుల్లో వీరు జరిపిన అమ్మకాలు రూ.4,300 కోట్లు దాటాయి.
తాజా మార్కెట్ పతనంతో రూ.2.4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.323 లక్షల కోట్ల నుంచి రూ.320.6 లక్షల కోట్లకు తగ్గింది.
ఇటీవలి ర్యాలీతో ఈక్విటీల విలువలు ఖరీదైపోయాయని, ఈ నేపథ్యంలో కరెక్షన్ రావాల్సి ఉన్నదని, దీనితో ఇన్వెస్టర్లు యూఎస్ ఫెడ్ మీటింగ్ జరగనున్న తరుణంలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ చెప్పారు. ప్రస్తుతం భారత్-కెనడాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం కూడా మార్కెట్లపై ఉన్నదని తెలిపారు. భారత్ ఈక్విటీ మార్కెట్లలో కెనడా ఫండ్స్ పెట్టుబడులు 45 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. ఈ ఫండ్స్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్ఫ్రా షేర్లలో అత్యధికంగా పెట్టుబడి చేశాయి. డాలర్ బలపడటం, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడంతో దేశీయ మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. నిధుల సమీకరణ వ్యయం పెరగడం, డిపాజిట్లు తగ్గడంతో బ్యాంక్ల నికర వడ్డీ లాభం తగ్గుతున్నదని, ఈ కారణంగా బ్యాంకింగ్ షేర్లు బాగా తగ్గాయని వివరించారు.