ముంబై, జూన్ 2 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్పడింది. ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపర్లలో జోష్ను పెంచింది. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 382.50 పాయింట్లు అందుకొని 74,649.84 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 100.95 పాయింట్లు ఎగబాకి 23,483.55 పాయింట్లకు చేరుకున్నది. ఐటీ రంగ షేర్లు నష్టపోవడం వల్లనే సూచీల్లో జోష్ అంతగా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.
గత కొన్ని రోజులుగా పతనాన్ని నమోదు చేసుకుంటున్న ఐటీ రంగ షేర్లు తిరిగి కోలుకున్నాయి. హెక్సావేర్ టెక్నాలజీస్ అత్యధికంగా 6.99 శాతం లాభపడగా..టీసీఎస్ అత్యధికంగా 6.5 శాతం, ఇన్ఫోసిస్ 5.66 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీ 4.08 శాతం, టెక్ మహీంద్రా 1.76 శాతం, విప్రో 1.65 శాతం చొప్పున బలపడ్డాయి. ఐటీ ఇండెక్స్ సూచీ అత్యధికంగా 4.40 శాతం వృద్ధిని కనబరిచింది. ఐటీ కంపెనీల ఆశాజనక ఫలితాలకు తోడు యూఎస్ టెక్నాలజీ కంపెనీల గైడెన్స్ బాగున్నట్టు వచ్చిన వార్తలు మదుపర్లను ఐటీ షేర్లను కొనుగోలు చేయడానికి ఉత్సుకతను ప్రదర్శించాయని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.