న్యూఢిల్లీ : బహుళ జాతి సంస్ధలపై బైడెన్ ప్రభుత్వం నూతన లెవీలు విధించనుండటంతో అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత్కు చెందిన ఐటీ, ఫార్మా దిగ్గజాలపై పన్ను భారం తీవ్రతరం కానుంది. బహుళ జాతి సంస్ధల అంతర్జాతీయ లాభాలపై మినిమం ట్యాక్స్ను విధించాలని అమెరికా యంత్రాంగం కసరత్తు సాగిస్తోంది. ఏ దేశంలోనైనా తమ లాభాల్లో కనీసం 28 శాతం పన్ను చెల్లించని కంపెనీలపై అమెరికాలో అదనపు లెవీల వడ్డన తప్పదని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్ఈజడ్లు) ద్వారా అమెరికాలో కార్యకలాపాలు సాగించే భారత ఐటీ, ఫార్మా కంపెనీలపై అదనపు పన్నుల భారం ఉంటుందని వారు చెబుతున్నారు.
నూతన లెవీ నిబంధనల ప్రకారం తమ లాభాలపై కనీస పన్ను చెల్లించని కంపెనీలు అమెరికాలో అదనపు పన్నులను చెల్లించాలని పన్ను నిపుణులు వెల్లడించారు. భారత సెజ్ల నుంచి అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తూ పన్ను రాయితీలు పొందుతున్న భారత ఐటీ, ఫార్మా కంపెనీలు అదనపు పన్నులు చెల్లించాల్సి వస్తుందని పన్ను నిపుణులు గిరీష్ వన్వారీ పేర్కొన్నట్టు ఓ వాణిజ్య వెబ్సైట్ కథనం వెల్లడించింది. నూతన పన్ను నిబంధనలతో సబ్సిడరీల ద్వారా నిర్వహించే భారత ఐటీ, ఫార్మా కంపెనీలతో పాటు అమెరికా ఎక్స్ఛేంజ్ల్లో ప్రత్యేకంగా లిస్టయిన సంస్థలపైనా పన్ను భారం పడనుందని పేర్కొంది.