హైదరాబాద్ : భారత ఆర్థిక వ్యవస్థ ( Indian Economy ) కుంటుపడుతోందని ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త, కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్బసు ( Kaushik Basu ) అభిప్రాయపడ్డారు. వరల్డ్ బ్యాంక్ గణాంకాలను పరిశీలించి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని వివరణ ఇచ్చారు. వార్షిక వృద్ధి రేటులో భారత్ వెనుకబడిపోయిందని తెలిపారు. చిన్న దేశాలతో పోలిస్తే పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ఒక శాతం అగ్ర శ్రేణి ప్రాధాన్యతలను గుర్తించడంలో చేసిన పొరపాటుకు ఇది మూల్యం అంటూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
Analyzing World Bank data shows India’s economy faltering. Annual growth over 2020-22 is 0.8%. This is less than many nations including China/Vietnam/B’desh. It hits harder since the top 1% is doing well. India has many strengths. This is a result of getting priorities wrong.
— Kaushik Basu (@kaushikcbasu) July 13, 2022
“ప్రపంచ బ్యాంకు డేటాను విశ్లేషిస్తే 2020-22లో భారత వార్షిక వృద్ధి 0.8శాతమే. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ సహా అనేక దేశాల కంటే ఇది చాలా తక్కువ. భారత్కు అనేక బలాలు ఉన్నాయి. కాకపోతే ఇది ప్రాధాన్యతల ఎంపికలో చేసిన పొరపాటుతో వచ్చిన ఫలితం. దయ, అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచన మంచి నైతిక లక్షణాలు.. దీర్ఘకాలంలో అవి స్థిరమైన వృద్ధికి పునాదులు వేస్తాయి. కానీ వాటి విస్మరణ అవే పునాదులను అస్థిరపరుస్తుంది” అని కౌశిక్బసు ట్వీట్ చేశారు. దేశ ఆర్థిక దుస్థితికి అద్ధంపడుతున్న ఆ ట్వీట్ను రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. “రూపాయి ఐసీయూలో ఉంది. మూడు నెలలుగా అది కోలుకుంటుందనే చెబుతున్నారే కానీ దాని కోసం ఏమైనా చేస్తున్నారా నరేంద్ర మోదీజీ.. ఇదేనా మీ జ్ఞానానికి ప్రతీక” అని ప్రశ్నిస్తూ మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు.