న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 : ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.3,103 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,956 కోట్ల లాభంతో పోలిస్తే 5 శాతం వృద్ధిని కనబరిచింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో లాభాల్లో వృద్ధి నమోదైందని బ్యాంక్ ఎండీ, సీఈవో బినోద్ కుమార్ తెలిపారు.
సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.18,599 కోట్ల నుంచి రూ.19,980 కోట్లకు పెరిగినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకూ రూ.18.25 లేదా 182.50 శాతం డివిడెండ్ను బోర్డు ప్రకటించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.09 శాతం నుంచి 1.98 శాతానికి పడిపోగా, నికర ఎన్పీఏ కూడా 0.19 శాతం నుంచి 0.15 శాతానికి దిగొచ్చాయి. అయినప్పటికీ మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.748 కోట్ల నిధులను వెచ్చించింది.