Nasscom-Digital | డిజిటల్ సర్వీసుల విస్తరణకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకే భారత్ లో ప్రధాన ప్రాధాన్యం ఉంటుందని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ రంగాలపై ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెంచుతాయని భావిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. `డిజిటల్ ఎంటర్ప్రైజెస్ మెచ్యూరిటీ 5.0: ఏఐ హయాంలో డిజిటల్ రెడీనెస్` అనే అంశంపై నాస్కామ్ సర్వే నిర్వహించింది. ఏడు ప్రధాన జియో గ్రాఫికల్ రీజియన్ల పరిధిలో 11 ప్రధాన రంగాల్లోకి 550 సంస్థల్లో నిర్వహించిన అధ్యయనం ఆధారంగా నాస్కామ్ ఈ నివేదిక రూపొందించింది.ఈ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), బిగ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ వంటి కీలక డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి సిద్ధమని దాదాపు 90 శాతం కంపెనీలు సంకేతాలిచ్చాయని ఈ సర్వేలో తేలింది.
2023లో కీలక టెక్నాలజీగా అవతరించిన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ)పై ఫోకస్ మరింత పెరుగుతుందని, 2025 తొలి అర్థభాగంలో ఐటీ కంపెనీలు సైబర్ సెక్యూరిటీపై కేంద్రీకరిస్తాయని నాస్కామ్ అంచనా వేసింది. డిజిటల్ టెక్నాలజీలో ప్రతిభ ఆధారంగా జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఐటీ కంపెనీలు ముందడుగు వేస్తాయని తెలిపింది. ఐటీ కంపెనీల్లో 83 శాతం సంస్థలు తమ సంస్థల్లో పని చేస్తున్న మొత్తం సిబ్బందిలో ఆరు శాతానికి పైగా డిజిటల్ రోల్స్కు అంకితమయ్యేలా ప్రోత్సహిస్తున్నాయని పేర్కొంది.
అంతే కాదు, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్లతో కూడిన బీఎఫ్ఎస్ఐ, హైటెక్, డిస్క్రీట్ మాన్యుఫ్యాక్చరింగ్, టెలికం, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ, ఆల్టర్నేటివ్స్ తదితర విభాగాల్లోనూ డిజిటల్ సర్వీస్ కాంట్రాక్టులు పెరుగుతున్నాయని నాస్కామ్ నివేదిక స్పష్టం చేసింది. డిజిటల్ సర్వీసుల పోర్ట్ఫోలియో విస్తరణ కోసం ఔట్ సోర్సింగ్ కేంద్రంగా నిలవడానికే భారత్ ఐటీ రంగం ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పింది. ట్రావెల్, ట్రాన్స్ పోర్టేషన్, టెలికం, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, నిర్మాణం, ఇంజినీరింగ్ రంగాల కంపెనీల్లో 50 శాతం ఔట్ సోర్సింగ్ సేవలే అందుకుంటున్నాయని పేర్కొంది. టెలికం, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ, యుటిలిటీస్ వంటి రంగాల్లో 47-49 శాతం సంస్థలు భారత్లోని తమ సొంత శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఔట్సోర్సింగ్ సర్వీసులు పొందుతున్నాయని వెల్లడించింది.