న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం చివరి మూడు క్వార్టర్లలో భారత్ ఆర్ధిక వృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. జులై, ఆగస్ట్లో స్థూల ఆర్థిక సంకేతాలు తిరిగి పుంజుకోవడంతో సత్వర వృద్ధి నమోదవుతుంందని అంచనా వేసింది.
కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో తదుపరి మూడు క్వార్టర్లలో వేగవంతమైన రికవరీ సాధ్యమవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన ఆగస్ట్ నివేదికలో పేర్కొంది.
ముమ్మరంగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, మహమ్మారిని ఎదుర్కోవడంలో అనుభవం ద్వారా కొవిడ్-19 థర్డ్ వేవ్ తలెత్తినా రికవరీ కొనసాగుతుందనే విశ్వాసం నెలకొందని తెలిపింది. విద్యుత్ వినియోగం, రైల్వే సరుకు రవాణా, హైవే టోల్, జీఎస్టీ వసూళ్లు వంటి స్ధూల ఆర్థిక సంకేతాలు ఆర్థిక రికవరీ మెరుగ్గా ఉంటుందనే అంచనా వెల్లడిస్తున్నాయని ఈ నివేదికలో ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.