Mukesh Ambani |ముంబై, మార్చి 30: బలమైన, వృద్ధిదాయక భారత నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత వ్యాపార, పారిశ్రామిక రంగాలపై ఉన్నదని దేశంలోనే శ్రీమంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) శనివారం ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముకేశ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే కొన్ని దశాబ్దాల్లో భారతీయ ఎగుమతులు 100 బిలియన్ డాలర్ల స్థాయిని తాకగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘వ్యాపార రంగంలో ఉన్న మనందరిపై మరింత బలమైన, వృద్ధిదాయక భారత్ను నిర్మించే బాధ్యత ఉన్నది. అంతా కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వికసిత భారత్ కలను సాకారం చేద్దాం’ అని అన్నారు. అన్ని రంగాల్లో ఈ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు. కాగా, గడిచిన కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్న దేశీయ రత్నాలు, వజ్రాల పరిశ్రమకు ముకేశ్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఎగుమతులు 40 బిలియన్ డాలర్లకు చేరాయని, 50 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టించారని కొనియాడారు. ఈ పరిశ్రమ పురోగతిలో పలన్పూర్ వాసుల పాత్ర ఎక్కువగా ఉండటం తనకు గర్వంగా ఉందన్నారు. తామూ వారితో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇక తన కోడలు శ్లోకా మెహతా కూడా ఈ రంగంలోనే ఉండటంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు జీవనకాల సాఫల్య పురస్కారం దక్కింది.