బంగారం ధరలు ఒక్కసారిగా పరుగులు పెట్టాయి.దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.దీంతో బహిరంగ మార్కెట్ లో తులం ధర ఒక్కరోజే రూ.1,100 వరకు ఎగబాకింది. 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములు రూ.51,500లను తాకింది.
న్యూఢిల్లీ, జూలై 1: కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేసింది. 10.75 శాతం నుంచి ఒక్కసారే 15 శాతానికి తీసుకెళ్లింది. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, పసిడిపై కనీస కస్టమ్స్ సుంకం ఇంతకుముందు 7.5 శాతంగా ఉండేది. ఇప్పుడిది 12.5 శాతానికి పెరిగింది. అయితే దీనికి వ్యవసాయ మౌలికాభివృద్ధి సెస్సు (ఏఐడీసీ) 2.5 శాతం అదనం. దీంతో కస్టమ్స్ సుంకం 15 శాతానికి చేరినైట్టెంది. ఇదిలావుంటే దేశంలోకి పసిడి దిగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో కరెంట్ ఖాతా లోటు కట్టడిలో భాగంగానే ఈ సుంకాల పెంపు అని మోదీ సర్కారు చెప్తున్నది. మే నెలలో 107 టన్నుల పుత్తడి దేశంలోకి దిగుమతి అయ్యింది. జూన్లోనూ ఇదే స్థాయిలో ఉండొచ్చంటున్నారు.
తులం రూ.51,500
బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. రిటైల్ మార్కెట్పై తక్షణమే ప్రభావాన్ని చూపింది. శుక్రవారం ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు రూ.51,458 పలికింది. గురువారం ముగింపుతో చూస్తే రూ.1,088 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1,794 డాలర్లుగా ఉంటే, వెండి 19.76 డాలర్లుగా ఉన్నది. దేశీయ మార్కెట్లో మాత్రం వెండి కిలో ధర రూ.411 పడిపోయి రూ.58,159 వద్దకు పరిమితమైంది.
ధరలు ఇంకా పైకి..
మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే వీలున్నదని ట్రేడింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం బంగారంవైపు చూసే అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే రిటైల్ మార్కెట్లో పసిడి ధరలు అమాంతం పెరిగిపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ మార్కెట్లలోనూ అనిశ్చితి ఉన్నందున గోల్డ్ సురక్షిత పెట్టుబడి సాధనంగా మదుపరుల ముందున్నదని చెప్తున్నారు.
స్మగ్లింగ్కు ఊతం
పసిడి దిగుమతులపై సుంకాన్ని పెంచుతూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం.. దేశంలో స్మగ్లింగ్కు ఊతమిచ్చే వీలున్నదని పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కేంద్రానికి అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) విజ్ఞప్తి చేసింది. పరిశ్రమపై పడిన ఈ భారాన్ని తగ్గించే దిశగా ముందుకెళ్తామన్నది. మలబార్ గోల్డ్ తదితర ప్రముఖ నగల వ్యాపార సంస్థలూ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాయి. కాగా, చైనా తర్వాత బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉన్నది. నిరుడు ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య దేశంలోకి జరిగిన బంగారం దిగుమతులు 842.28 టన్నులుగా ఉన్నాయి.
‘బంగారంపై దిగుమతి సుంకంలో ఈ ఆకస్మిక పెంపు ఆశ్చర్యానికి గురిచేసింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పరిస్థితిని మేము అర్థం చేసుకుంటాం. కానీ ఈ స్థాయిలో సుంకాలను పెంచితే అది స్మగ్లింగ్కు దారితీయవచ్చు’
-ఆశిష్ పీతే, జీజేసీ చైర్మన్