Inflation-RBI | రిటైల్ ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. ధరలను కట్టడి చేయడానికి తమ ప్రయత్నాల నేపథ్యంలో గత రెండు నెలలుగా రిటైల్ ద్రవ్యోల్బణం కాసింత తగ్గడం రిలీఫ్ కలిగించిందని పేర్కొన్నది. కానీ అధిక ధరల ముప్పు నుంచి ఇంకా భారత్ బయట పడలేదని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరాసరి ద్రవ్యోల్బణం 5.4 శాతం వద్ద కొనసాగుతుందని హెచ్చరించింది.
‘ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. సెప్టెంబర్ నెలలో ఐదు శాతం, అక్టోబర్ నెలలో 4.87 శాతం ద్రవ్యోల్బణం నమోదు కావడం స్వాగతించాల్సిందే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటున 6.7 శాతం, జూలై-ఆగస్టులో 7.1 శాతం ద్రవ్యోల్బణం నమోదైన నేపథ్యంలో గత రెండు నెలల గణాంకాలు కాస్త రిలీఫ్ ఇచ్చాయి. కానీ ఈ నెల 13 వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం పప్పులు, తృణ ధాన్యాల ధరలు పెరుగుతుంటే.. వంట నూనెల ధరలు తగ్గుతున్నాయి’ అని ఆర్బీఐ పేర్కొంది.
దేశీయంగా ప్రజల గిరాకీపై గ్రోత్ రేట్ ఆధార పడి ఉందని ఆర్బీఐ తన ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ నివేదికలో పేర్కొంది. కానీ, అంతర్జాతీయ పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు ఆరోగ్యకరంగానే ఉన్నాయని పేర్కొంది. ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం కాలంలో జీడీపీ గ్రోత్ రేటు ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నామని తెలిపింది.