న్యూఢిల్లీ, ఆగస్టు 30: భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారీగా పెరుగుతుందని పలు సంస్థలు అంచనాల్ని ప్రకటించాయి. ప్రధానంగా 2020 ఏప్రిల్-జూన్లో దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఏర్పడిన లోబేస్తో ఈ క్వార్టర్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని వివిధ అంచనాలు వెలువడ్డాయి. గతేడాది తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి మైనస్లోకి జారిపోయింది. -24.4 శాతంగా నమోదయ్యింది. ఇక 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో 1.6 శాతం వృద్ధి నమోదయ్యింది. కొవిడ్ సెకండ్వేవ్ భయపడినంత తీవ్రంగా లేనందున, జూన్ నెలలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం కూడా జీడీపీ భారీ వృద్ధికి కారణమని విశ్లేషకులు చెప్పారు. జూన్ త్రైమాసికంలో కార్పొరేట్లు ఇప్పటికే మంచి ఆర్థిక ఫలితాల్ని వెల్లడించాయని, జీడీపీ వృద్ధి గణాంకాల్లో సైతం ఇదే ట్రెండ్ కన్పిస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ చీఫ్ ఎకానమిస్ట్ అనఘా దియోదర్ చెప్పారు. ఆగస్టు 31న నేషనల్ స్టాటస్టికల్ ఆర్గనైజేషన్ అధికారికంగా జీడీపీ గణాంకాలు వెల్లడించనున్న నేపథ్యంలో వెలువడిన అంచనాలిలా ఉన్నాయి.