Industry on Budget | ప్రజల్లో వినియోగ సామర్థ్యం పెంపొందించాలంటే తక్షణం ఉద్యోగాల కల్పనతోపాటు జీఎస్టీ, వ్యక్తిగత ఆదాయం పన్ను శ్లాబ్లు క్రమబద్ధీకరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఐఐ సూచించింది. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలపై సోమవారం నిర్మలా సీతారామన్.. పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ప్రీ-బడ్జెట్ సమావేశంలో సీఐఐ అధ్యక్షుడు సంజీబ్ బజాజ్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వృద్ధిరేటును ప్రోత్సహించేందుకు పెట్టుబడుల ఆధారిత కేటాయింపులు పెంచాలని, ప్రైవేటీకరణ మీద ఫోకస్ చేయాలని సూచించారు. ‘కొంత కాలం అంతర్జాతీయ పరిస్థితులు అననుకూలంగా ఉండే అవకాశం ఉంది. కనుక, మనం వినియోగదారుల గిరాకీ పెంచేందుకు.. ఉపాధి కల్పనతోపాటు కొత్త రంగాల్లో వృద్ధిరేటు పెంచాలి` అని పేర్కొన్నారు.
కొత్త ఉద్యోగాల కల్పనకు ఉపాధి ఆధారిత ఇన్సెంటివ్ స్కీమ్ ప్రవేశపెట్టడంతోపాటు పట్టణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. వచ్చే బడ్జెట్లో ప్రయోగాత్మకంగా మెట్రో నగరాల పరిధిలో అమలు చేయాలి అని సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు.
వ్యాపారాలు, పారిశ్రామిక సంస్థలకు ప్రస్తుత స్థాయిలోనే పన్నుల్లో రాయితీలు కొనసాగించాలని సంజీవ్ బజాజ్ సూచించారు. తేలిగ్గా పన్నుల చెల్లింపునకు వాటిని సరళీకరించాలి, హేతుబద్ధీకరించాలని పేర్కొన్నారు.
దేశ ఆర్థిక వృద్ధిరేటు ప్రోత్సాహానికి బడ్జెట్లో చేపట్టాల్సిన చర్యలపై మరో ఇండస్ట్రీ బాడీ పీహెచ్డీసీసీఐ కూడా సూచనలు చేసింది. సామాజిక మౌలిక వసతులను మెరుగు పర్చడంతోపాటు ఉద్యోగాల కల్పనకు ఫ్యాక్టరీల సామర్థ్యం పెంపొందించాలి. ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాలని పేర్కొంది. ఇందుకోసం ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని పేర్కొంది.
అంతర్జాతీయంగా భౌగోళికంగా-రాజకీయంగా అనిశ్చితులు కొనసాగుతున్న వేళ.. అధిక ద్రవ్యోల్బణం, నెమ్మదించిన ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు మధ్య 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధిరేటు ప్రోత్సాహానికి దేశీయ వనరుల సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకోవాలని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్డీసీసీఐ) అధ్యక్షుడు సాకేత్ దాల్మియా ఒక ప్రకటనలో తెలిపారు.