న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర 80 డాలర్లు దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్పై విండ్ఫాల్ టాక్స్ను స్వల్పంగా పెంచింది. పక్షం రోజులకోసారి సవరించే ఈ పన్నును టన్ను క్రూడాయిల్పై రూ.3,300కు చేర్చింది. ఫిబ్రవరి 16 నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి వస్తాయి.
రెండు వారాల క్రితం ఇది రూ.3,200 ఉంది. అలాగే తాజాగా డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు సుంకాన్ని లీటరుకు రూ.1.50కు పెంచింది. గతంలో దీనిపై పన్నును పూర్తిగా తొలగించి జీరో చేసింది. పెట్రోల్, విమానయాన ఇంధనం ఎగుమతులపై సుంకాన్ని జీరో శాతం వద్దే నిలిపిఉంచింది. ఇంధన కంపెనీలు అధికంగా ఆర్జించే లాభాలపై కేంద్రం విండ్ఫాల్ టాక్స్ విధింపును 2022 జూలై 1 నుంచి ప్రారంభించింది. ప్రపంచ మార్కెట్లో రెండు వారాల సగటు ఆయిల్ ధరల ఆధారంగా ప్రతీ పక్షం రోజులకోసారి పన్ను రేట్లను సవరిస్తుంది.