Google | వాషింగ్టన్, జూన్ 17: ‘విశ్వగురు’గా మారిన భారత్ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. తమకు కూడా ఇండియానే అతిపెద్ద మార్కెట్ అని, అక్కడున్న అద్భుతమైన వనరులు, ప్రతిభ, ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల తయారీకి సాయపడుతున్నట్టు గూగుల్ ప్రపంచ వ్యవహారాలు, ప్రజా విధానాల హెడ్ కరణ్ భాటియా వెల్లడించారు. ప్రపంచంలోనే ఇండియా తమకు ముఖ్యమైన మార్కెటని, అది తమకు రెండో ఇల్లు లాంటిదని తెలిపారు. రెండు దశాబ్దాలుగా తాము భారత్లో ఉన్నామని, అక్కడ తమకు వేలాదిమంది ఉద్యోగులు ఉన్నారని వివరించారు.
ఇండియాను డైనమిక్ మార్కెట్గా అభివర్ణించిన ఆయన గత 9 ఏండ్లలో అక్కడ ఇంటర్నెట్ విస్ఫోటనాన్ని చూస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ ఫస్ట్ బిజినెస్ల పరంగా గ్రామీణ ప్రాంతాలు దూసుకెళ్తున్నాయని వివరించారు. ప్రభుత్వం కూడా డిజిటలైజేషన్, డిజిటల్ విధానాల ఆవశ్యకతను గుర్తించిందని చెప్పారు. డిజిటల్ స్పేస్లో యూఎస్, భారత్ మధ్య భాగస్వామ్యాల స్థాయికి రెట్టింపు స్థాయిని ఇప్పటి నుంచి మూడేండ్లలో చూడాలనుకుంటున్నామని, ఇది వాస్తవిక రూపం దాలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.