FDI rules : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత సరిహద్దును పంచుకునే దేశాలకు సంబంధించి పెట్టుబడుల్ని ఆకర్షించేలా నిబంధనల్లో సవరణలు చేసింది. దీనివల్ల చైనా వంటి సరిహద్దు దేశాల నుంచి పెట్టుబడుల రాక మరింత సులభతరం కానుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై సరిహద్దు దేశాలు ఇండియాలో ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇండియాలో పది శాతం వరకు పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు.
గతంలో ఇండియాలోని కంపెనీలలో ఈ దేశాలు ఒక్క శాతం వాటా దక్కించుకోవాలనుకున్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఇండియాలోని ఏ కంపెనీలోనైనా సులభంగా 10 శాతం వాటాను సరిహద్దు దేశాలు దక్కించుకోవచ్చు. ఈ నిర్ణయంతో ఇండియా సరిహద్దు దేశాలైన చైనా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి పెట్టబడులు రావొచ్చు. ఈ మేరకు మోదీ ఆధ్వర్యంలో సోమవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే, విదేశీ పెట్టుబడులకు సంబంధించి కొన్ని రంగాల్లో ఉన్న ఇతర ఆంక్షలు, నిబంధనలు మాత్రం అలాగే ఉంటాయి. అంతకుముందు సులభతరమైన నిబంధనలే ఉండేవి. కానీ, కోవిడ్ సమయంలో దేశీయ కంపెనీల్ని కాపాడేందుకు కేంద్రం నిబంధనల్ని కఠినతరం చేసింది.
విదేశీ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెడుతూ, మన కంపెనీల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం, పెత్తనం చెలాయించడం వంటివి చేస్తుండటంతో కేంద్రం నిబంధనల్ని మార్చింది. ముఖ్యంగా 2020లో చైనా, భారత సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణ నేపథ్యంలో కేంద్రం చైనా సహా సరిహద్దు దేశాల పెట్టుబడులపై ఆంక్షలు విధించింది.