Wheat | దేశీయంగా గోధుమల ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విదేశాల నుంచి గోధుమల దిగుమతిపై ఎక్సైజ్ సుంకం 40 శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే వ్యాపారుల వద్ద నిల్వలపై పరిమితులు విధించాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రపంచంలోనే అత్యధికంగా గోధుమలు పండిస్తున్న మనదేశంలో ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గోధుమలపై సుంకం తగ్గింపు, వ్యాపారుల వద్ద నిల్వలపై పరిమితులు విధించాలని తీర్మానించినట్లు సమాచారం.
ఈ నెల 14 నుంచి మైదా పిండి, గోధుమ రవ్వ ఎగుమతులపైనా కేంద్రం ఆంక్షలు విధించనున్నది. ఈ ఉత్పత్తుల ఎగుమతిపై వివిధ మంత్రిత్వశాఖల కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకున్నది. తీవ్ర వేడిగాలుల నేపథ్యంలో రబీ సీజన్లో పంట దిగుబడి తగ్గడంతో గోధుమల ఎగుమతిపై గత మేనెలలోనే కేంద్రం నిషేధం విధించింది. అప్పటికే దేశీయ మార్కెట్లో పెరిగిపోయాయి. అంతకంటే ఎక్కువగా ఉన్న అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా విదేశాల నుంచి గోధుమల కొనుగోలు తమ వల్ల కాదని వ్యాపారులు చేతులు ఎత్తేశారు.
దిగుమతి సుంకాలు తగ్గిస్తే అంతర్జాతీయ మార్కెట్లో గోధుమల ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న పండుగల సీజన్లో గోధుమ ఉత్పత్తులకు డిమాండ్.. దానికి అనుగుణంగా అధిక ధరలు పలుకుతాయని చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో గోధుమ ఉత్పత్తుల ధరలు తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.