చెన్నై, ఏప్రిల్ 13: గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ) అడ్డాగా భారత్ మారిపోతున్నది. అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు ఇక్కడే జీసీసీలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని బిజినెస్ కన్సల్టెంగ్ కంపెనీ ఏఎన్ఎస్ఆర్ సర్వే వెల్లడించింది. ఇప్పటికే ఏఎన్ఎస్ఆర్..110 జీసీసీలను 1.2 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణ స్థలంలో ఏర్పాటు చేసింది. వీటిలో 1.20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ జీసీసీల్లో 50 శాతం భారత్లోనే ఏర్పాటు కావడం విశేషం.
కృత్రిమ మేధస్సు/మెషిన్ లెర్నింగ్, అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో భారీ వృద్ధిని నమోదవుతున్నదని ఏఎన్ఎస్ఆర్ కో-ఫౌండర్ విక్రమ్ అహుజా తెలిపారు. మొత్తం జీసీసీల్లో బెంగళూరు వాటా 30 శాతంగా ఉండగా, హైదరాబాద్ వాటా 19 శాతం, ఢిల్లీ 15 శాతం, ముంబై 12 శాతం, పుణె వాటా 10 శాతం, చెన్నై 9 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం 46 బిలియన్ డాలర్లుగా ఉన్న జీసీసీ రంగం..2030 నాటికి 110 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని అంచనావేస్తున్నది.