Sugar Exports : చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు బుధవారం కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో చక్కెర ధరల్ని నియంత్రించే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చక్కెరతోపాటు చక్కెర ఉత్పత్తి చేసే చెరుకు వంటి ముడి పదార్థాల ఎగుమతుల్ని కూడా కేంద్రం నిషేధించింది.
ఇటీవలి కాలంలోచక్కెర ఉత్పత్తి తగ్గిపోతోంది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. అందుకే కేంద్రం ఈ అంశంపై స్పందించింది. విదేశాలకు భారత చక్కెర ఎగుమతులు నిలిపివేయడంతో అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చక్కెరతోపాటు, సంబంధిత ముడి పదార్థాల ధరలు కూడా అంతర్జాతీయంగా పెరగొచ్చని అంచనా. ఇదే సమయంలో ఇండియాతోపాటు చమురు ఎగుమతుల్లో కీలకంగా ఉన్న బ్రెజిల్, థాయ్లాండ్ వంటి దేశాలకు మంచి వ్యాపార అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. భారత చక్కెర లేని లోటుని, ఆ దేశాలు తమ దగ్గర ఉత్పత్తైన చక్కెరను అందించి భర్తీ చేయొచ్చు. దీనివల్ల ఆయా దేశాలకు ఆసియా, ఆఫ్రికా మార్కెట్లలో చక్కెర ఎగుమతులపై మంచి పట్టు దొరికే ఛాన్స్ ఉంది.
ప్రపంచంలోనే ఇండియా రెండో అతిపెద్ద చక్కెర ఎగుమతిదారు. ఈ ఏడాది 1.59 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతించింది. ఇదే సమయంలో దేశంలో తగినంత చక్కెర ఉత్పత్తి జరిగి, ఇక్కడ ధరలు అందుబాటులో ఉంటాయని భావించింది. అయితే, పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చక్కెర ఎక్కువగా పండించే అనేక ప్రాంతాల్లో ఈసారి వాతావరణ మార్పులు సహా వివిధ కారణాలతో దిగుబడి తగ్గింది. దీంతో తగినంతగా చమురు ఉత్పత్తి జరగడం లేదు. మార్కెట్ వర్గాల ప్రకారం.. 8 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర ఉత్పత్తికి ఒప్పందం కుదరగా, 6 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే ఎగుమతి జరిగింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వచ్చింది. అయితే, ఇప్పటికే లోడింగ్ ప్రారంభమైన వాటికి మాత్రం వర్తించదు.