హైదరాబాద్, ఆగస్టు 9: ఐపీవోలతో స్టాక్ మార్కెట్ కళకళలాడుతున్నది. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుండటం, వ్యాపార రంగం తిరిగి కోలుకుంటుండటంతో కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇందుకోసం అవసరమైన నిధులను కంపెనీల్లో వాటాలను విక్రయించడం ద్వారా సేకరించడానికి సిద్ధమవుతున్నాయి. అలాగే ప్రమోటర్లు, షేర్హోల్డర్లు వారికున్న వాటాల్లో కొంతశాతాన్ని మార్కెట్లో విక్రయించడానికి సైతం ముందుకొస్తున్నారు. ఇటీవల తొలి పబ్లిక్ ఆఫర్లు (ఐపీవోలు) జారీకాని వారంగానీ, అవి లిస్ట్కాని వారంగానీ లేదంటే ఆతిశయోక్తి కాదు. ఆగస్టు9న రోలెక్స్ రింగ్స్ భారీ ప్రీమియంతో లిస్ట్కాగా, గత శుక్రవారం గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెక్స్ ఐపీవో మార్కెట్లను పలకరించింది. ఆగస్టు 11న కృస్న డయాగ్నస్టిక్ ఐపీవో లిస్ట్ కానుంది.ఇలా కొన్ని ఐపీవోలు లిస్టవుతూ వుంటే, రూ.15,000 కోట్లు సమీకరించేందుకు ఈ వారం నాలుగు కంపెనీలు ఐపీవోల్ని జారీచేస్తున్నాయి. ఇందులో మల్టీచానల్ ఆటో ప్లాట్ఫామ్ను నిర్వహించే కార్ట్రేడ్ టెక్ ఐపీవో ఆగస్టు 9న ఆరంభమయ్యింది. స్పెషాలిటీ పీవీసీ రెసిన్ ఉత్పత్తిచేసే కెమ్ప్లాస్ట్ సన్మార్ 10న ఐపీవోకు వస్తున్నది. సిమెంటు కంపెనీ నువోకో విస్తాస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఐపీవోలు మొదలయ్యేదీ ఈ వారమే. ఈ ఏడాది ఇప్పటివరకూ 27 ఐపీవోలు జారీకాగా, అవి రూ.40,000 కోట్లు సమీకరించాయి. మరిన్ని కంపెనీల ఐపీవోలకు ఇప్పటికే సెబి ఆమోదముద్ర వేసింది. ఐపీవోలు వెల్లువెత్తడానికి పలు కారణాల్ని మార్కెట్ విశ్లేషకులు చూపిస్తున్నారు. మార్కెట్లోకి ప్రవేశించడానికి కాచుక్కూర్చున్న భారీ నిధులు, భారీ ప్రీమియంతో లిస్టింగ్లు, వాటాల్ని అధిక ధరకు విక్రయించుకునేందుకు ప్రమోటర్లకు లభిస్తున్న అవకాశం వంటివి ప్రధానమైన కారణాలు.
ప్రమోటర్లు ఇదే తరుణం
స్వంత నిధులతో కంపెనీని ఆరంభించి, వృద్ధికి మరిన్ని పెట్టుబడులు చేసిన ప్రమోటర్లు, కంపెనీ ఎదిగే దశలో వాటిలో ఇన్వెస్ట్చేసిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ఇతర షేర్హోల్డర్లు వారి వాటాల్ని నగదుగా మార్చుకోవడానికి మంచి తరుణంగా ప్రస్తుత ట్రెండ్ను చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన చాలావరకూ ఐపీవోలు వాస్తవానికి ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్)లే. అంటే కంపెనీలో తమకు ఉన్న వాటాల్ని ప్రమోటర్లు, షేర్హోల్డర్లు విక్రయించడం. జొమోటో, రోలెక్స్ రింగ్స్, కార్ట్రేడ్ టెక్ తదితర ఐపీవోలన్నీ ప్రమోటర్లు, షేర్హోల్డర్ల విక్రయాలే. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐపీ) భారీ ఐపీవో కూడా ఈ తరహాదే.
భారీ లిస్టింగ్ లాభాలు
కొద్దిరోజుల క్రితం లిస్టయిన ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో ఇష్యూ ధర రూ.76తో పోలిస్తే రూ.130 వద్ద లిస్టయ్యింది. అంటే ఐపీవోకు దరఖాస్తుచేసిన పదిరోజుల్లోనే 90 శాతం లాభం. ఆ మధ్య లిస్టయిన హ్యాపియస్ట్ మైండ్స్ 50 శాతం లాభాల్ని పంచితే, ఈ సోమవారం లిస్టయిన రోలెక్స్ రింగ్స్ 40 శాతం లాభాన్ని మొదటిరోజే ఇచ్చింది. స్వల్పకాలంలో అధిక రాబడులొస్తున్న నేపథ్యంలో ఐపీవోలకు జోరుగా సబ్స్క్రిప్షన్లొస్తున్నాయి.
నిధుల ప్రవాహం
ఐపీవోలకు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున సబ్స్క్రయిబ్ చేస్తున్నారు. గతవారం జారీఅయిన నాలుగు ఐపీవోలు-దేవయాని ఇంటర్నేషనల్, కృస్న డయాగ్నస్టిక్, విండ్లాస్ బయోటెక్, ఎక్స్రో టైల్స్ షేర్లను కోరుతూ రూ.1.71 లక్షల కోట్ల బిడ్స్ దాఖలయ్యాయి. ఇవి రూ.14,630 కోట్ల నిధుల కోసం ఐపీవోలకొస్తే, అవి ఎన్నో రెట్లు ఓవర్సబ్స్క్రయిబ్ అయ్యాయి. కేవలం రిటైల్ ఇన్వెస్టర్లే వీటిలో రూ. 18,000 కోట్ల విలువ గల షేర్లకు దరఖాస్తు చేశారు.