ManKind Pharma | ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ ‘మాన్కైండ్ ఫార్మా’ ఆఫీసులపై ఆదాయం పన్నుశాఖ గురువారం తనిఖీలు చేపట్టింది. న్యూఢిల్లీలోని సంస్థ కార్యాలయంలో తనిఖీలు చేపట్టినట్లు ఐటీ విభాగం అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ కథనం రాసింది. మాన్కైండ్ ఫార్మా విజయవంతంగా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయిన వెంటనే ఆ సంస్థపై ఐటీ దాడులు జరుగడం ఆసక్తికర పరిణామం. ఐటీ దాడుల నేపథ్యంలో గురువారం కంపెనీ స్టాక్ విలువ ఒకానొక దశలో 5.5 శాతం పతనమైంది. ఇటీవలి కాలంలో విజయవంతంగా ఐపీవోతో లిస్టయిన కంపెనీగా మాన్కైండ్ ఫార్మా నిలిచింది.
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి మాన్ కైండ్ షేర్లు లిస్టయ్యాయి. లిస్టయిన రోజే 32 శాతం పుంజుకున్నాయి. దీంతో మాన్ కౌండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.56,976 కోట్లు (6.97బిలియన్ డాలర్లు) గా నిలిచింది. ఐటీ దాడుల నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ లో సంస్థ స్టాక్ 3.5 శాతం నష్టపోయి, రూ.1,355 వద్ద ట్రేడవుతున్నది. ఐపీఓ ఆఫర్ రూ.1080 కంటే ఇది ఎక్కువే.
మాన్ కైండ్ సంస్థ దేశంలో వివిధ వ్యాధులకు ఔషధాలు తయారు చేస్తున్నది. ఐపీవోలో మాన్ కైండ్ ఫార్మా షేర్లకు 15.32 రెట్ల స్పంద లభించింది. ఐపీఓలో ఒక లాట్ కింద 13 షేర్లు కొనాలని లక్ష్యంగా పెట్టారు. అంటే మాన్ కైండ్ ఐపీవోలో పాల్గొన్న వారు రూ.14,040 పెట్టుబడి పెట్టారు. మంగళవారం స్టాక్ మార్కెట్లలో లిస్టయిన తర్వాత బీఎస్ఈలో 20శాతం లాభంతో రూ.1300 వద్ద లిస్టయింది. ఒక దశలో సుమారు 30 శాతం లాభంతో రూ.1400 గరిష్టాన్ని తాకింది. షేర్లు అలాట్ అయిన వారి పెట్టుబడి లిస్టింగ్ ధర రూ.16,900కు చేరుకుంది.