న్యూఢిల్లీ, జనవరి 11: రూపే డెబిట్ కార్డులు, భీమ్/యూపీఐ లావాదేవీలను ప్రమోట్ చేసేందుకు రూ.2,600 కోట్లతో ఒక స్కీమ్ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. రూపే కార్డును ఉపయోగించి జరిపే ఈ-కామర్స్ లావాదేవీలు, తక్కువ విలువతో కూడిన భీమ్-యూపీఐ లావాదేవీల్ని (వ్యక్తి నుంచి వ్యాపారికి), పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్)ను ప్రమోట్ చేసే భాగస్వామ్య బ్యాంక్లకు ఈ స్కీమ్ కింద ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోది అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది.
ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,600 కోట్ల మొత్తాన్ని నిర్దేశించారు. యూపీఐ లైట్, యూపీఐ123పే ద్వారా జరిపే లావాదేవీలకు సైతం ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. క్యాబినెట్ నిర్ణయాల్ని కేంద్ర మంత్రి భూపేందర్ యూదవ్ మీడియాకు వివరిస్తూ ఈ స్కీమ్ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ఎంఎస్ఎంఈలకు, అవ్యవస్థీకత రంగానికి, రైతులకు చేరువ చేస్తుందని చెప్పారు. గత డిసెంబర్ నెలలో యూపీఐ ద్వారా రూ.12.82 లక్షల కోట్ల విలువైన 782.9 కోట్ల లావాదేవీలు జరిగాయి.