Stock Market | ముంబై, ఏప్రిల్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లపై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా అలజడికి గురయ్యాయి. మదుపరుల్లో ఆందోళన పెరగడంతో అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ప్రపంచమార్కెట్లతోపాటు దేశీయ సూచీలు కుప్పకూలాయి. వరుసగా రెండోరోజు 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ భారీగా నష్టపోయింది. ఇంట్రాడేలో 900 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ చివరకు 845.12 పాయింట్లు లేదా 1.14 శాతం నష్టపోయి రెండు వారాల కనిష్ఠ స్థాయి 73,399.78 పాయింట్లను తాకింది. మరోసూచీ నిఫ్టీ కూడా 246.90 పాయింట్లు కోల్పోయి 22,272.50 వద్ద ముగిసింది. గత సెషన్లలోనూ సూచీలు ఒక్క శాతానికి పైగా కోల్పోయిన విషయం తెలిసిందే.
మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులు మదుపరుల్లో ఆందోళనలను పెంచింది. ఫలితంగా సోమవారం సెషన్లోనే మదుపరులు రూ.5 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.5,18,953.97 కోట్లు కోల్పోయి రూ.3,94,48,097.94 కోట్లకు(4.73 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది.