న్యూఢిల్లీ, జనవరి 4: బంగారం ధరలు దిగొస్తున్నాయి. గతకొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లో అక్కడక్కడే కదలాడుతున్న గోల్డ్ రేట్లు.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. గురువారం హైదరాబాద్లో తులం ధర రూ.440 పడిపోయింది. దీంతో 99.9 స్వచ్ఛత కలిగిన మేలిమి బంగారం 10 గ్రాములు రూ.63,380 వద్దకు వచ్చింది. బుధవారం కూడా రూ.270 క్షీణించగా, ఈ రెండు రోజుల్లో రూ.710 దిగజారినైట్టెంది. నగల తయారీకి వినియోగించే 22 క్యారెట్ పుత్తడి విలువ కూడా రూ.400 దిగి తులం రూ.58,100 పలికింది. రెండు రోజుల్లో రూ.650 తగ్గింది. అటు ఢిల్లీలోనూ రూ.420 పడిపోయి 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.63,550గా ఉన్నది.
గ్లోబల్ మార్కెట్లలో..
అంతర్జాతీయ విపణిలో బలహీన సంకేతాల ప్రభావం.. దేశీయ మార్కెట్పైనా పడుతున్నదని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. ‘ఓవర్సీస్ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్స్తోనూ భారతీయ మార్కెట్లో ధరలు దిగొస్తున్నాయి’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్లో కమాడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. గ్లోబల్ మార్కెట్లలో ఔన్సు బంగారం 2,042 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. వడ్డీరేట్లను తగ్గించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ యోచిస్తుండటంతో కోమెక్స్ గోల్డ్ రేట్లు రెండు వారాల కనిష్ఠానికి పడిపోయినట్టు గాంధీ చెప్పారు.
వెండి ధరలూ డౌన్
వెండి ధరలూ తగ్గుతున్నాయి. కిలో వెండి ధర రూ.2,000 దిగింది. హైదరాబాద్లో రూ.78,000 వద్ద స్థిరపడింది. బుధవారం రూ.300 పడిపోగా, రెండు రోజుల్లో రూ. 2,300 క్షీణించింది. ఢిల్లీలోనూ రూ. 1,900 పతనమై రూ.76,900 వద్ద ముగిసింది.