ముంబై, ఏప్రిల్ 29: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తిరిగి లాభాల బాట పట్టాయి. ఉదయం ఆరంభం నుంచే కొనుగోళ్ల జోష్లో ఉన్న మదుపరులు.. ఆఖరుదాకా అదే దారిలో దుసుకెళ్లారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 941.12 పాయింట్లు లేదా 1.28 శాతం పుంజుకుని 74,671.28 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో సూచీ 990.99 పాయింట్లు పెరగడం విశేషం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 223.45 పాయింట్లు లేదా 1 శాతం కోలుకుని 22,643.40 వద్ద నిలిచింది. బ్యాం కింగ్, మౌలిక రంగాల షేర్లకు పెద్ద ఎత్తున లభించిన కొనుగోళ్ల మద్దతే ఈ జోరుకు కారణమని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల దృక్పథం కూడా కలిసొచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు సెన్సెక్స్లో అత్యధిక లాభాలను సొంతం చేసుకున్నాయి. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 18.5 శాతం పెరిగిన నేపథ్యంలో షేర్ల విలువ సుమారు 5 శాతం ఎగిసింది. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లూ ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లూ చెప్పుకోదగ్గ లాభాలనే అందుకున్నాయి. అయితే హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు గరిష్ఠంగా దాదాపు 6 శాతం మేర నష్టాలను చవిచూశాయి. జనవరి-మార్చిలో నిరాశాజనక ఆర్థిక ఫలితాలే కారణమంటున్నారు. ఐటీసీ, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లూ మదుపరులను ఆకర్షించలేకపోయాయి.
బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఆల్టైమ్ హైకి చేరింది. సోమవారం భారీ లాభాల మధ్య మదుపరుల సంపద మునుపెన్నడూ లేనివిధంగా రూ.406.52 లక్షల కోట్లను తాకింది. ఈ ఒక్కరోజే రూ. 2,48,043.51 కోట్లు ఎగబాకి రూ. 4,06,52,419.94 కోట్లకు వెళ్లింది. సెన్సెక్స్తోపాటు మిడ్, స్మాల్క్యాప్లూ పెరిగాయి.
దేశీయ కరెన్సీ రూపాయికి అమెరికా ఫెడరల్ రిజర్వు సెగ గట్టిగానే తాకింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి 83.45 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 10 పైసల వరకు నష్టపోయిన మారకం విలువ చివర్లో భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. ఈ వారంలోనే వడ్డీరేట్లపై ఫెడ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో మదుపరులు ముందస్తుగా జాగ్రత్త చర్యలకు మొగ్గుచూపారు. 83.39 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ రేటు ఇంట్రాడేలో 83.51 కనిష్ఠ స్థాయికి జారుకున్నది. చివరకు ఏడు పైసలు నష్టపోయి 83.45 వద్ద స్థిరపడింది.