న్యూఢిల్లీ : ఆహారోత్పత్తుల ధరలు, ముడి చమురు ధరల పెరుగుదలతో మేలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు స్ధాయిలో 15.88 శాతానికి ఎగబాకింది. టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 15.08 శాతం కాగా, గత ఏడాది మేలో 13.11 శాతం పెరుగుదల నమోదు చేసింది. మేలో ద్రవ్యోల్బణం రికార్డు స్ధాయిలో ఎగబాకేందుకు మినరల్ ఆయిల్స్, ముడి పెట్రోలియం, సహజ వాయువు, ఆహోరోత్పత్తులు, బేసిక్ మెటల్స్, ఆహారేతరోత్పత్తులు, రసాయన ఉత్పత్తుల ధరలు పెరగడమే కారణమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
టోకు ద్రవ్యోల్బణం గత ఏడాది ఏప్రిల్ నుంచి వరసగా 14వ నెలలో కూడా రెండంకెల పెరుగుదల నమోదు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక మేలో ఆహారోత్పత్తుల ధరలు 12.34 శాతంగా నమోదైంది. పండ్లు, కూరగాయలు, గోధుమలు, బంగాళదుంపల ధరల పెరుగుదలతోనే ఆహారోత్పత్తుల ధరల సూచీ ద్రవ్యోల్బణం ఎగబాకింది.
ఇక కూరగాలయ ధరలు ఏకంగా 56.36 శాతం పెరగ్గా, గోధుమల ధరలు 10.55 శాతం, గుడ్లు, మాంసం, చేపల ధరలు 7.78 శాతం పెరిగాయి. ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 40.62 శాతంగా నమోదైంది. తయారీ వస్తువులు, నూనె గింజల ధరలు 10.11, 7.08 శాతం పెరిగాయి. ఇక మేలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాల కంటే అధికంగా వరుసగా ఐదో నెలలోనూ 7.04 శాతంగా నమోదైంది.