విదేశీ సంస్థలన్నీ భారత్కే రావాలి.. మా దేశంలో వ్యాపారం అంటే ఇక్కడే తయారు చేయాలి.. చైనా ఉత్పత్తులను తగ్గించుకుందాం.. ఇవీ.. మేక్ ఇన్ ఇండియా, స్వావలంబన భారతం అంటూ కేంద్రం ఎప్పుడూ చెప్తున్న మాటలు. కానీ.. మోదీ హయాంలో చైనాతో భారత్ వాణిజ్యం భారీగా పెరుగుతున్నది. ఇప్పటికీ ఆ దేశ దిగుమతులే ఆధారమంటే అతిశయోక్తి కాదు. జనవరి-జూన్లో భారత్ వాణిజ్య లోటు 48 బిలియన్ డాలర్లు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా స్వావలంబన భారతమే లక్ష్యమంటూ ఊదరగొట్టే మోదీ సర్కారు.. చేతల్లో మాత్రం ఆ లక్ష్యశుద్ధిని చూపడం లేదు. ‘మేక్ ఇన్ ఇండియా’కు తూట్లు పొడుస్తూ దిగుమతుల్ని పెంచుకుంటూపోతున్నది. ఈ క్రమంలో పొరుగు దేశం చైనా ఉత్పత్తులూ దేశంలోకి ఎడాపెడా దిగుతున్నాయి. ఇదే ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా పరిణమించేలా ఉన్నది. సరిహద్దుల్లో భారత్-చైనా సంబంధాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గల్వాన్ ఘటన జరిగిన నాటి నుంచి దేశంలో చైనా ఉత్పత్తుల నిషేధం జోరందుకున్న విషయమూ తెలిసిందే. దేశ ప్రజల్లోనూ చైనా వస్తూత్పత్తులపై వ్యతిరేకత పెరిగిపోయింది. కానీ దేశాన్ని పాలించే పాలకుల్లో మాత్రం ఇది ఎంతమాత్రం కనిపించకపోవడం గమనార్హం.
22 ఏండ్లుగా చైనాతో వాణిజ్యం
2000 సంవత్సరం నుంచి భారత్-చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మొదలైంది. మొదట్నుంచి భారత్పై డ్రాగన్ ఆధిపత్యం సహజంగానే కొనసాగుతుండగా, గత పదేండ్ల నుంచి ఇది పెరుగుతూవస్తున్నది. మోదీ హయాంలో మరింత వేగాన్ని అందుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే నిరుడు ఇరు దేశాల మధ్య వాణిజ్యం విలువ తొలిసారి రూ.8,30,000 కోట్ల (100 బిలియన్ డాలర్లు) మార్కును దాటింది. ఇక గత ఐదేండ్లలో చైనా నుంచి భారత్కు దిగుమతులు సుమారు 30 శాతం పెరిగినట్టు ఈ ఏడాది జూలైలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఈ క్రమంలో ఈ ఏడాది గత ఏడాదిని మించి వాణిజ్య లోటు నమోదు కావచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ జనవరి-జూన్లో చైనా నుంచి భారత్కు 34.5 శాతం దిగుమతులు పెరిగాయి. చైనాకు భారత్ ఎగుమతులు 35 శాతం తగ్గుముఖం పట్టాయి. కేంద్రం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాలు, అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరే దీనికి కారణమంటూ ఆర్థిక నిపుణుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ దేశ వినియోగదారుల్ని వదులుకునేందుకు డ్రాగన్ ససేమిరా అంటున్నది. ఈ క్రమంలోనే స్థానిక వ్యతిరేకతను తప్పించుకునేందుకు ‘మేడ్ ఇన్ చైనా’కు బదులుగా ‘మేడ్ ఇన్ పీఆర్సీ’ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) పేరుతో దిగుమతుల్ని చేస్తున్నది.
చైనా నుంచి దిగుమతులివే..