హైదరాబాద్, డిసెంబర్ 5: తక్కువ వడ్డీకే మహిళలకు రుణాలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది దేశంలో అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ మైక్రోఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన ఐఐఎఫ్ఎల్. ఈ ఆఫర్ కింద వ్యవసాయ కార్మికులు, కూరగాయలు, పూలు అమ్మేవారు, బట్టలు అమ్మేవారు, టైలర్లతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్మికుల కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్నట్టు కంపెనీ ట్రెజరీ హెడ్ మోహన్ కుమార్ చెప్పారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో సంస్థ రూ.233 కోట్ల లాభాన్ని గడించింది.
రూ.1,000 కోట్ల నిధుల సేకరణకోసం సెక్యూర్డ్ బాండ్లను జారీ చేయనున్నట్టు ఐఐఎఫ్ఎల్ ప్రకటించింది. వ్యాపార విస్తరణ కోసం అవసరమయ్యే నిధులను సేకరించడానికి బాండ్లను జారీ చేస్తున్నది. ఈ బాండ్లపై 10.50 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నది సంస్థ. బాండ్ల జారీతో రూ.200 కోట్లు, గ్రీన్-షో ఆప్షన్ కింద మరో రూ.800 కోట్లు సేకరించాలనుకుంటున్నట్టు మోహన్ కుమార్ తెలిపారు. 24, 36, 60 నెలల కాలపరిమితితో లభించనున్న ఈ బాండ్లను కొనుగోలు చేసిన వారికి వడ్డీని నెలవారి, వార్షికంగా చెల్లింపులు జరపనున్నట్టు తెలిపారు. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఉన్న 1,500 శాఖల్లో కూడా లభించనున్నాయి.